సంగారెడ్డి జిల్లా పరిధిలోని పెద్దాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZP High School)లో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో మధ్యాహ్నం అందించిన ఆహారం వికటించి (ఫుడ్ పాయిజన్) సుమారు 20 మంది విద్యార్థులతో పాటు వైస్ ప్రిన్సిపాల్ వెంకటేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన భోజనం తిన్న కొద్దిసేపటికే పలువురు విద్యార్థులు , ఉపాధ్యాయులు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు లోనయ్యారు. బాధితుల పరిస్థితిని గమనించిన పాఠశాల సిబ్బంది, స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.
ఆసుపత్రులకు తరలింపు.. వైస్ ప్రిన్సిపాల్ పరిస్థితి విషమం
అస్వస్థతకు గురైన విద్యార్థులను, వైస్ ప్రిన్సిపాల్ వెంకటేష్ను చికిత్స నిమిత్తం సదాశివపేట , సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యవసరంగా తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలోని వైద్యులు బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ వెంకటేష్ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. మధ్యాహ్న భోజనంలో వడ్డించిన ఆహారం కలుషితం కావడమే ఈ ఫుడ్ పాయిజనింగ్కు ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

