NTV Telugu Site icon

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. ఎన్‌కౌంటర్‌ చేయాల్సిందే..!

హైదరాబాద్‌ నడి బొడ్డున దారుణమైన ఘటన జరిగింది.. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్‌ చేసిన కామాంధుడు.. పాశవికంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు.. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా నుంచి నగరానికి వలస వచ్చిన ఓ కుటుంబం సింగరేణి కాలనీలో నివాసం ఉంటుంది.. అయితే, ఉన్నట్టుండి చిన్నారి కనిపించకుండా పోయింది.. ఎంతవెతికినా ప్రయోజనం లేకుపోవడంతో.. పక్కనే ఉన్న రాజు అనే వ్యక్తిపై అనుమానం వచ్చింది.. అర్ధరాత్రి 12 గంటలకు రాజు ఇంట్లో చూడగా చిన్నారి మృతదేహం కనిపించింది.. బాలికపై అత్యాచారం చేసి నిందితుడు హత్య చేసినట్టు గుర్తించారు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. నిందితుడిని అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు పోలీసులు.

పోలీసులు, స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. నిందితుడిని వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు స్థానికులు.. పోలీసులు, స్థానికుల మధ్య తోపులాట జరిగింది. ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు పోలీసులపై రాళ్లు రువ్వి, కారం చల్లారు. దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు దాటిపోతుండటంతో కాలనీలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక, అంతటితో ఆగని సింగరేణి కాలనీ వాసులు.. పక్కనే ఉన్న హైదరాబాద్‌ – నాగార్జున సాగర్‌ హైవేపై ఆందోళనకు దిగారు.. ఇంకా తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నా.. నిందితుడు రాజును ఎన్‌కౌంటర్‌ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక, సింగరేణి వాసుల ఆందోళనకు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు మద్దతుగా నిలిచారు.. జాతీయ రహదారిపై బైఠాయించడం తో వాహనాల రాకపోకలు నిలిచిపోయి.. ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో.. దారి మళ్లింపు చర్యలు చేపట్టారు పోలీసులు.. ఆందోళన విరమించేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.. మరోవైపు.. హైదరాబాద్ కలెక్టర్ తో గిరిజన సంఘాల నాయకులు చర్చలు జరుపుతున్నారు.