KA Paul: మునుగోడు నిరుద్యోగులకు కేఏ పాల్ బంపరాఫర్

Ka Paul Bumper Offer

Ka Paul Bumper Offer

KA Paul Announced Bumper Offer To Munugodu Unemployed Youth: మునుగోడు నిరుద్యోగ యువతకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపరాఫర్ ప్రకటించారు. తన 59వ పుట్టినరోజు సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని 59 మంది నిరుద్యోగులను లాటరీ పద్ధతిన ఎంపిక చేసి.. వారికి పాస్ పోర్ట్‌తో పాటు అమెరికన్ విసాను ఉచితంగా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇందుకోసం.. మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 50 వేల మంది నిరుద్యోగులు తమ రెజ్యూమ్‌లు తీసుకొని, సెప్టెంబర్ 25న శ్రీవారి హోమ్స్ గ్రౌండ్స్‌కి రావాలని సూచించారు. తన జన్మదిన కానుకగా ఇస్తోన్న ఈ సదవకాశాన్ని మునుగోడు యువత అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను మంగళవారం విడుదల చేశారు.

ఇంకా ఎక్కువ మంది వస్తే.. ఒక్కో గ్రామం నుంచి ఒక్కొక్కరికి చొప్పున 175 గ్రామాల నుంచి 175 మందికి పాస్‌పోర్ట్ సహా అమెరికన్ వీసా స్పాన్సర్‌షిప్ ఇప్పిస్తానని కేఏ పాల్ ప్రకటించారు. ఒక బీసీ కుటుంబంలో పుట్టి, దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్న తనకు.. నిరుద్యోగుల కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలుసని చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని సీఎం కేసీఆర్, సంవత్సరానికి రెండు కోట్లు ఇస్తానని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పి.. ఇంతవరకూ ఆ హామీల్ని నెరవేర్చలేదని ఈ సందర్భంగా దుయ్యబట్టారు. ఇంకా నిరుద్యోగులు ఎక్కువ అయిపోయారని చెప్పిన ఆయన.. ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో వారి మాటలు నమ్మకుండా, మనల్ని మనం అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎవరి డబ్బులు తనకు అవసరం లేదని.. మునుగోడు నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకుందామని కేఏల్ పాల్ ఆ వీడియోలో పేర్కొన్నారు.