ఛత్తీస్గఢ్లో సంచలనం సృష్టించిన జీరమ్ ఘాటి మావోయిస్టుల దాడి కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. 2013లో కాంగ్రెస్ నేతల కాన్వాయ్పై జరిగిన భీకర మావోయిస్టు దాడిలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం దాదాపు మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఈ కేసులో 13 ఏళ్లకు పైగా విచారణ అనంతరం 10 మంది దోషులకు ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఇద్దరు మహిళలు సహా 10 మందికి ఉరిశిక్ష విధించింది. సెప్టెంబర్ 5న జగదల్పూర్ ఎన్ఐఏ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అభయ్ సింగ్ రాజ్పుత్ నేతృత్వంలోని ధర్మాసనం నిందితులందరినీ దోషులుగా నిర్ధారించింది. బుధవారం కీలక తీర్పు వెలువరించింది. నిందితులందరికీ ఉరిశిక్ష విధించింది.
కాన్వాయ్పై మెరుపు దాడి
2013 మే 25న ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా దర్భా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జీరమ్ ఘాటి ప్రాంతంలో ఈ దాడి జరిగింది. కాంగ్రెస్ నిర్వహించిన ‘పరివర్తన్ ర్యాలీ’లో పాల్గొని తిరిగి వస్తున్న నేతల కాన్వాయ్ను జాతీయ రహదారిపై మావోయిస్టులు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అప్పటి ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నంద్ కుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేశ్ పటేల్, అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నేత మహేంద్ర కర్మ, మాజీ కేంద్ర మంత్రి విద్యాచరణ్ శుక్లా, మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముద్లియార్ సహా పలువురు కీలక కాంగ్రెస్ నాయకులు మరణించారు. భద్రతా సిబ్బంది, సాధారణ పౌరులు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 29 మంది మృతి చెందారు.
101 మంది సాక్షుల వాంగ్మూలాలు
ఈ కేసు విచారణలో భాగంగా మొత్తం 101 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. భారీ సంఖ్యలో పత్రాలను కూడా కోర్టు పరిశీలించింది. ఈ నెల ప్రారంభంలో జగ్దల్పూర్లోని ప్రత్యేక NIA కోర్టు న్యాయమూర్తి అభయ్ సింగ్ రాజ్పుత్ 10 మందిని దోషులుగా నిర్ధారించారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. బుధవారం ప్రత్యేక కోర్టు మొత్తం 10 మంది దోషులకు ఉరిశిక్ష విధించింది. 24 అభియోగాల్లో ఏడు అభియోగాల కింద ఈ శిక్ష విధించినట్లు కోర్టు తెలిపింది. ప్రతి దోషికి రూ.800 చొప్పున జరిమానా కూడా విధించింది. అయితే కోర్టు విధించిన ఉరిశిక్షను వెంటనే అమలు చేయడం సాధ్యం కాదు. హైకోర్టు ఆమోదం తర్వాతే శిక్ష అమలు చేయాల్సి ఉంటుంది. అప్పటివరకు దోషులు సెంట్రల్ జైలులోనే ఉంటారు. తీర్పుపై 30 రోజుల్లో హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.
కుట్రపై భూపేష్ బఘేల్ ప్రశ్నలు
జీరమ్ ఘాటి దాడి కేసు దర్యాప్తుపై కాంగ్రెస్ నేత, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గతంలో పలుమార్లు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ దాడి వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)కు స్వతంత్రంగా విచారణ చేసే అవకాశం ఇచ్చి ఉంటే.. ఈ కుట్ర వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించే అవకాశం ఉండేదని బఘేల్ పేర్కొన్నారు.
బఘేల్ వ్యాఖ్యలపై రమణ్ సింగ్ విమర్శలు
బఘేల్ వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి, మాజీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రమణ్ సింగ్ స్పందించారు. బఘేల్కు ఈ కేసుపై నిజంగా శ్రద్ధ లేదని విమర్శించారు. ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని మాత్రమే చూస్తున్నారని ఆరోపించారు.

