పర్యావరణ హితం, దేశ వ్యాప్తంగా పచ్చదనం కోరుకుంటూ మొదలైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదవ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. వానాకాలం సీజన్ తోనే మొక్కలు నాటే ఉద్యమం మొదలు కాబోతోంది. ఇవాళ (గురువారం) శంషాబాద్ సమీపంలోని (ముచ్చింతల్ రోడ్) గొల్లూరు ఫారెస్ట్ పార్క్ లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమౌతుంది.
పుడమిని రక్షించుకుందాం, నేల తల్లి మరింత క్షీణించకుండా కాపాడుకుందాం అంటూ సేవ్ సాయిల్ (Save Soil) ఉద్యమంతో సద్గురు ప్రపంచయాత్ర చేపట్టారు. ఈ యాత్ర ఈనెల 15న (బుధవారం) హైదరాబాద్ చేరుకుని, నేడు కర్నూలు మీదుగా బెంగుళూరు వెళ్తుంది.
రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఐదేళ్ల కింద చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలుసుకున్న సద్దురు ఈ మహత్ కార్యక్రమంతో తాను కూడా పాల్గొని మొక్కలు నాటేందుకు సుముఖత తెలిపారు. దీనిలో భాగంగా గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు సద్దురు గొల్లూరు చేరుకుని సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలు నాటి, ఐదవ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను లాంఛనంగా ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమంలో.. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిధులుగా పాల్గొని మొక్కలు నాటుతారు. కార్యక్రమం కోసం తరలివచ్చే ప్రముఖులు, గ్రీన్ ఇండియా ప్రేమికులు, సద్గురు మార్గాన్ని అనుసరిస్తున్న అభిమానులు ఇదే అటవీ ప్రాంతం వేదికగా ఒకే సారి పదివేల మొక్కలను నాటనున్నారు. క్షీణించిన అటవీ ప్రాంతాన్ని పునరుజ్జీవనం చేయటంలో భాగంగా తెలంగాణ అటవీశాఖ ఈ కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో కలిసి నిర్వహిస్తోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో 2018లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఒక్కరు మూడు మొక్కలు నాటి, మరో ముగ్గురిని మొక్కలు నాటాల్సిందిగా ఛాలెంజ్ విసరటమే గ్రీన్ ఇండియా కార్యక్రమం స్ఫూర్తి. ప్రారంభించిన అనతికాలంలోనే దేశ వ్యాప్తంగా ఉద్యమరూపం దాల్చింది. అనేక రంగాల ప్రముఖులను ఒక్క తాటిపైకి చేర్చి హరిత స్ఫూర్తిని నింపింది గ్రీన్ ఇండియా ఛాలెంజ్.
Viral: సొంత ప్రభుత్వంపైనే ఉద్యమం.. వైన్ షాపుపై పేడతో దాడిచేసిన మాజీ సీఎం..
