హైదరాబాద్ నగరంలో పేదల ఆకలిని తీరుస్తూ సేవలందిస్తున్న అన్నపూర్ణ క్యాంటీన్లు ఇప్పుడు మరింత విస్తరించనున్నాయి. ఇప్పటికే ఈ క్యాంటీన్లలో కార్మికులు, విద్యార్థులు, పేద ప్రజలు రోజూ కేవలం రూ.5కే భోజనం చేస్తుండగా.. ఇప్పుడు వాటిని “ఇందిరమ్మ క్యాంటీన్లు”గా మారు రూపంలో ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఇందిరమ్మ క్యాంటీన్లలో ఇక భోజనమే కాకుండా ఉదయాన్నే టిఫిన్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇడ్లీ, ఉప్మా, పులిహోర వంటి సాంప్రదాయ టిఫిన్లు మెనూలో చేర్చాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రక్రియలో భాగంగా, నగరంలో కొత్త క్యాంటీన్ల అవసరం తలెత్తడంతో ప్రభుత్వం 139 ప్రాంతాల్లో కొత్త కంటైనర్ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది. దీని కోసం మొత్తం రూ.11.43 కోట్లు ఖర్చుచేయనున్నారు.
త్వరలోనే ఈ కొత్త క్యాంటీన్ల ద్వారా ప్రజలకు టిఫిన్, భోజనం రెండింటినీ రూ.5కే అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ చర్యలతో నగరంలోని పేదల జీవన నాణ్యత మెరుగుపడనుందని భావిస్తున్నారు.
