Telangana TET Notification: నేడు టెట్ నోటిఫికేషన్… జాబ్ కేలండర్ ప్రకారం నిర్వహణ..

  • నేడు టెట్ నోటిఫికేషన్- జనవరి లో టెట్ ఎగ్జామ్..
  • నేడు టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్న విద్యాశాఖ..
  • జాబ్ కేలండర్ ప్రకారం నోటిఫికేషన్ నిర్వహణ..
  • ఈ ఏడాది ఇప్పటికే ఒక టెట్ నిర్వహించిన విద్యా శాఖ..
Tet Notification

Tet Notification

TelanganaTET Notification: టెట్ నోటిఫికేషన్ సోమవారం విడుదల కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ పూర్తి చేసింది. జాబ్ కేలండర్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. గతంలో ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది మార్చి 14 న నోటిఫికేషన్ ఇచ్చి మే 20 నుంచి జూన్ 2 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నవంబర్‌లో రెండో టెట్‌కు నోటిఫికేషన్ విడుదల చేసి జనవరిలో పరీక్షలు నిర్వహిస్తామని గత ఆగస్టులో ఉద్యోగాల క్యాలెండర్ విడుదల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. జనవరిలో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.

Read also: Astrology: నవంబర్ 04, సోమవారం దినఫలాలు

గత మే నెలలో నిర్వహించిన టెట్ పరీక్షకు 2 లక్షల 86 వేల 386 మంది దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 2.35 లక్షల మంది రాశారు. 12 జూన్ న పలితాలు ప్రకటించగా.. వారిలో 1.09 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి డీఎస్సీ కూడా పూర్తి కావడంతో పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య కాస్త తగ్గుతుందని భావిస్తున్నారు. పరీక్షలు ఆన్‌లైన్‌లో ఉన్నందున, వారానికి కనీసం 10 రోజులు స్లాట్‌లు అందుబాటులో ఉండాలి. అందుకే సంక్రాంతి లోపు నిర్వహిస్తారా? ఆ తర్వాత? అనేది ఇప్పుడే చెప్పలేమని ఓ అధికారి వ్యాఖ్యానించారు. టెట్ పేపర్-1కి డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తిచేసిన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేందుకు టెట్ అర్హత సాధించాల్సి ఉన్నందున వేలాది మంది సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కూడా పరీక్షకు హాజరు కానున్నారు. టెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు పరీక్షలు నిర్వహించగా…పదోసారి జనవరిలో నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత మే పరీక్షతో కలిపి ఆరుసార్లు పరీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్ నిర్వహించడం విశేషం.
CM Revanth Reddy : తెలంగాణలో బీసీ కులగణనకు డెడికేషన్‌ కమిషన్‌