Site icon NTV Telugu

Hyderabad Metro: నగర ప్రజలకు గుడ్‌న్యూస్‌.. అర్ధరాత్రి 2 గంటల వరకూ మెట్రో సేవలు

Hyderabad Metro

Hyderabad Metro

Hyderabad Metro: గణేష్ నిమజ్జనం కోసం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పదకొండో రోజైన గురువారం జరిగే నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. హుస్సేన్‌సాగర్‌ చుట్టుపక్కల 5 చోట్ల 36 క్రేన్లు, పదుల సంఖ్యలో జేసీబీలు, టిప్పర్లు, వేలాది మంది సిబ్బందితో నిమజ్జన కేంద్రాలను సిద్ధం చేశారు. మరో 100 చోట్ల నిమజ్జనాలు జరుగుతాయని, అన్ని ప్రాంతాల్లో క్రేన్లు, ఇతర యంత్రాలు, సిబ్బందిని విధులు కేటాయించామని జీహెచ్‌ఎంసీ తెలిపింది. అయితే గణేష్ నిమజ్జనాన్ని చూసేందుకు వస్తున్న భక్తులకు టీఎస్‌ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో, ఎంఎంటీఎస్ శుభవార్త అందించాయి. హుస్సేన్‌సాగర్‌కు నలుమూలల నుంచి 535 బస్సులు నడుపుతామని ప్రకటించింది. భక్తుల కోసం 29వ తేదీ ఉదయం రాత్రి వరకు ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు మెట్రో సేవలు కొనసాగుతున్నాయి. భక్తులు, నగర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

ఇందుకోసం ఖైరతాబాద్, లక్డీకపూల్, గాంధీభవన్, నాంపల్లి మెట్రో స్టేషన్లలో అదనపు సిబ్బందిని నియమించారు. శోభాయాత్ర జరిగే రహదారుల వెంట పారిశుద్ధ్య కార్యక్రమాలు, బారికేడ్లు, సూచిక బోర్డులు, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశారు. భక్తులు, నిమజ్జన సిబ్బంది, కార్మికులు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోతే వారిని త్వరగా రక్షించేందుకు నగరవ్యాప్తంగా 200 మంది గజ ఈతగాళ్లను నియమించారు. సాగర్ చుట్టూ వైద్య శిబిరాలు, వివిధ రహదారులపై 79 అగ్నిమాపక శాఖ వాహనాలను అందుబాటులో ఉంచారు. జలమండలి పది లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతుంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణేష్ ఊరేగింపు, నిమజ్జనానికి రాజధాని నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో రికార్డు స్థాయిలో దాదాపు 40 వేల మంది పోలీసులను భద్రత కోసం వినియోగిస్తున్నారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 25,694 మంది విధుల్లో పాల్గొంటున్నారు.

125 ప్లాటూన్ల అదనపు బలగాలు, ఆర్ఏఎఫ్, పారామిలటరీ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. సైబరాబాద్, రాచకొండలో మొత్తం 13 వేల మంది గస్తీలో పాల్గొంటారు. 48 గంటల పాటు సాగిన ఆందోళనలు, నిమజ్జనం సందర్భంగా 20 వేలకు పైగా సీసీ కెమెరాలతో పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ముగ్గురు కమిషనర్లు సీవీ ఆనంద్, డీఎస్ చౌహాన్, స్టీఫెన్ రవీంద్ర ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఊరేగింపు మార్గాలు, నిమజ్జన ప్రాంతాలను నేరుగా సందర్శించి భద్రతను సమీక్షించారు. రూట్ మ్యాప్ ఖరారైంది. నగర పోలీసు చరిత్రలో అత్యంత అత్యద్భుతమైన గణేష్ నిమజ్జనం మిలాద్ ఉన్ నబీ 35 ఏళ్ల తర్వాత అదే రోజు రాబోతోంది. పోలీసు ఉన్నతాధికారులు ముస్లిం మత పెద్దలతో మాట్లాడి మిలాద్ ఉన్ నబీ ర్యాలీని 1వ తేదీకి వాయిదా వేశారు. అదే రోజు జరుపుకోవాలని కొందరు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి సున్నిత పరిస్థితులు తలెత్తాయి. దీంతో మూడు కమిషనరేట్ల పరిధిలో అసాధారణ ఏర్పాట్లు చేస్తున్నారు.
TS TET Results: నేడే తెలంగాణ టెట్‌ ఫలితాలు.. చెక్‌ చేసుకోండి ఇలా..

Exit mobile version