తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ హుజురాబాద్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్.. నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధును ప్రారంభించనున్నారు. ముందుగా అర్హులైన 15 కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు ముఖ్యమంత్రి. ఇప్పటికే దీని కోసం ప్రభుత్వం 500 కోట్ల నిధులను విడుదల చేసింది. ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధమంటోంది. హుజూరాబాద్లో సీఎం కేసీఆర్ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కేసీఆర్ సభ జరగనుంది. 100 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో భారీ వేదిక ఏర్పాటు చేశారు. సభ ఏర్పాట్లను మంత్రి హరీష్రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పరిశీలించారు. కాగా… హుజూరాబాద్ నియోజక వర్గంలో ఐదు మండలాలున్నాయి. ఇందులో రెండు మున్సిపాలిటీలు. దళితబంధు కోసం ఒక్కో మండలానికి ఇద్దరిని ఎంపిక చేశారు. మున్సిపాలిటీల నుంచి ముగ్గురిని ఎంపిక చేశారు. ఒక్కో లబ్దిదారుడికి పది లక్షల విలువైన యూనిట్ను అందించబోతున్నారు. నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇళ్లందకుంట, కమలాపూర్లలో ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక పూర్తైంది.
