NTV Telugu Site icon

మంత్రి తలసాని కుమారుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్‌పై హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఖైరతాబాద్‌లో శుక్రవారం జరిగిన సదర్ ఉత్సవాలకు తలసాని సాయికిరణ్ యాదవ్ హాజరయ్యారు. అయితే ఆయన కారులో వెళ్తున్న సమయంలో… రైల్వే గేటు సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఓ పాదచారుడి ఎడమ కాలుపై నుంచి కారు ప్రయాణించింది.

Read Also: డీజిల్ ధర విషయంలో అగ్రస్థానంలో తెలుగు రాష్ట్రం

ఈ ఘటనలో ఇందిరానగర్‌కు చెందిన సంతోష్ (32) తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాధితుడిని స్థానికులు సమీపంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సంతోష్ ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదానికి సంబంధించి బాధితుడు సంతోష్ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మంత్రి తలసాని కుమారుడు సాయికిరణ్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.