Site icon NTV Telugu

Bomb Threat : బహ్రెయిన్‌–హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు

Flight

Flight

Bomb Threat : బహ్రెయిన్ నుంచి హైదరాబాద్‌కు రాబోతున్న ఒక విమానానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో అలజడి చెలరేగింది. ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి పంపిన ఈమెయిల్‌ను గుర్తించిన వెంటనే విమానయాన అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, విమానాన్ని గమ్యస్థానం అయిన హైదరాబాద్‌కు కాకుండా మధ్యలో ముంబైకి మళ్లించారు. ఈ ఘటనతో విమానంలో ప్రయాణిస్తున్న 154 మంది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

ముంబై విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవగానే భద్రతా ఏర్పాట్లు కఠినతరం అయ్యాయి. బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్‌తో కలిసి విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. దీర్ఘంగా సాగిన ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో అధికారులు ఇది తప్పుడు బెదిరింపేనని నిర్ధారించారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

అన్ని పరీక్షలు పూర్తయ్యాక, విమానం తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరేందుకు అనుమతి లభించింది. అనంతరం ప్రయాణికులు సురక్షితంగా హైదరాబాద్ చేరుకున్నారు. ఇదిలా ఉండగా, తప్పుడు బెదిరింపు ఈమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు భద్రతా సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. విమాన ప్రయాణ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Spirit : ప్రభాస్ ను దాచేస్తున్న వంగా.. కారణం అదేనా !

Exit mobile version