Online Cybersecurity Course: ఒక ఫోన్ కాల్… ఒక నకిలీ లింక్… ఒక ఓటీపీ. కేవలం కొన్ని నిమిషాల్లోనే జీవితకాల సేవింగ్స్ ఖాళీ అవుతున్న కాలం ఇది. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతే వేగంతో సైబర్ నేరగాళ్లు కూడా కొత్త తరహా మోసాలతో చెలరేగిపోతున్నారు. ఒకప్పుడు బ్యాంక్ మేనేజర్ పేరుతో వచ్చే కాల్స్ వరకే పరిమితమైన డిజిటల్ మోసాలు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మరింత ప్రమాదకరంగా మారాయి. నకిలీ కేవైసీ అప్డేట్లు, వాట్సాప్ లింకులు, ఫిషింగ్ ఈమెయిల్స్, డిజిటల్ అరెస్ట్ స్కామ్లు… ఇవన్నీ సాధారణ ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో డిజిటల్ అవగాహన పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత సైబర్ సెక్యూరిటీ కోర్స్ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంటే ఐ4సీ ఈ కోర్సును రూపొందించింది. కేవలం రెండున్నర గంటల వ్యవధిలో పూర్తయ్యే ఈ ఆన్లైన్ కోర్స్ ద్వారా సాధారణ ప్రజలకు సైబర్ మోసాలను ఎలా గుర్తించాలి, డిజిటల్ ప్లాట్ఫారమ్లను ఎలా సురక్షితంగా ఉపయోగించాలనే విషయాలను నేర్పించనున్నారు. సైబర్ దోస్త్ ఐ4సీ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ కోర్సును ప్రకటిస్తూ, మోసపూరిత కాల్స్, ఫేక్ లింకులు, స్కామ్ మెసేజ్లు ప్రతి రోజూ కొత్త రూపాల్లో వస్తున్నాయని హెచ్చరించింది. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ కూడా అందజేయనున్నట్లు వెల్లడించింది.
ఇటీవల దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన పలు సైబర్ మోసాల నేపథ్యంలో ఈ కోర్సుకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా ఆదాయపన్ను శాఖ పేరుతో పంపిస్తున్న నకిలీ ఈమెయిల్స్ ఇప్పుడు పెద్ద ముప్పుగా మారాయి. సిల్వర్ ఫాక్స్ హ్యాకర్ గ్రూప్ పేరుతో గుర్తించిన ఈ ఫిషింగ్ నెట్వర్క్, అసలైన ట్యాక్స్ నోటీసుల్లా కనిపించే ఈమెయిల్స్ పంపిస్తూ ప్రజలను మోసం చేస్తోంది. ట్యాక్స్ కంప్లయన్స్ పేరుతో అత్యవసర భావన కలిగించి, మెయిల్లోని ఫైల్ డౌన్లోడ్ చేయించేలా చేస్తోంది. ఒకసారి ఆ ఫైల్ ఓపెన్ చేస్తే మాల్వేర్ డివైస్లోకి ప్రవేశించి వ్యక్తిగత సమాచారం మొత్తం దోచేస్తోంది. భారత్తో పాటు ఇతర దేశాల్లో కూడా ఈ దాడులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
అహ్మదాబాద్లో ఇటీవల బయటపడిన ఆధార్ మోసం మరింత భయంకరంగా ఉంది. సైబర్ నేరగాళ్లు ఏఐ టూల్స్ ఉపయోగించి బాధితుల ఆధార్ వివరాలను మార్చేశారు. మొబైల్ నంబర్లను తమ నియంత్రణలోకి తీసుకుని ఓటీపీలు పొందుతూ అకౌంట్లను యాక్సెస్ చేశారు. అంతేకాదు, నకిలీ వీడియోలు సృష్టించి బయోమెట్రిక్ వెరిఫికేషన్ వ్యవస్థలను కూడా మోసం చేసినట్లు విచారణలో తేలింది. ఇది సాధారణ హ్యాకింగ్ స్థాయిని దాటి, కృత్రిమ మేధస్సును ఆయుధంగా మార్చుకున్న సైబర్ నేరాల కొత్త దశగా నిపుణులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో డిజిటల్ అరెస్ట్ స్కామ్లపై కూడా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. సిమ్ కార్డ్ జారీ ప్రక్రియలో బయోమెట్రిక్ వెరిఫికేషన్ను మరింత కట్టుదిట్టం చేయడం, స్కామ్లకు ఉపయోగించే డివైస్లను బ్లాక్ చేయడం, వాట్సాప్ వంటి ప్లాట్ ఫామ్లపై పర్యవేక్షణ పెంచడం వంటి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. అనుమానాస్పద మోసాలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను వెంటనే ఫ్రీజ్ చేసే వ్యవస్థను కూడా ప్రభుత్వం తీసుకురావాలని యోచిస్తోంది.
ఈ ఉచిత కోర్సులో నకిలీ లింకులను ఎలా గుర్తించాలి, వ్యక్తిగత సమాచారాన్ని ఎలా రక్షించుకోవాలి, అనుమానాస్పద మెసేజ్లను ఎలా గుర్తించాలి, డిజిటల్ సేవలను సురక్షితంగా ఎలా వినియోగించాలి వంటి అంశాలు ఉంటాయి. విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు, ప్రైవేట్ ఉద్యోగులు ఇలా ఎవరికైనా ఈ కోర్సులో చేరే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ( https://learning.cte-i4c.live ) వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పేరు, ఈమెయిల్, యూజర్ నేమ్, పాస్వర్డ్ నమోదు చేసి అకౌంట్ సృష్టించిన తర్వాత మెయిల్ ద్వారా వచ్చే లింక్తో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. తర్వాత కోర్సుకు యాక్సెస్ లభిస్తుంది.
డిజిటల్ ఇండియా వేగంగా విస్తరిస్తున్న సమయంలో సైబర్ భద్రత కూడా అంతే కీలకంగా మారింది. బ్యాంక్ ఖాతాలు, ఆధార్, పాన్, వ్యక్తిగత డేటా అన్నీ మొబైల్ స్క్రీన్లోకి చేరిన ఈ టెక్ యుగంలో, ఒక్క నిర్లక్ష్యం భారీ నష్టంగా మారే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు సైబర్ అవగాహన కూడా విద్యలో భాగమవుతోంది. ఈ కోర్సు కేవలం సర్టిఫికెట్ కోసం కాదు. డిజిటల్ ప్రపంచంలో మనల్ని మనం రక్షించుకునే కనీస ఆయుధంగా మారుతోంది.
