AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?

Ai In Media

Ai In Media

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తోంది. జర్నలిజంతో సహా ఎన్నో రంగాలను ఇది పూర్తిగా మార్చేస్తోంది. అయితే, ఈ తరుణంలో మీడియా రంగాన్ని ఓ ముఖ్యమైన ప్రశ్న వేధిస్తోంది. మానవ సృజనాత్మకత దెబ్బతినకుండా, ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలను ఎలా ఉపయోగించుకోవాలి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే.. తాజాగా ఇదే అంశంపై సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ (SPIEF) 2026 వేదికగా ‘ది లిమిట్స్ ఆఫ్ AI ఇన్ ది మీడియా’ అనే సెషన్‌లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న ఇండియా టుడే గ్రూప్ వైస్-ఛైర్‌పర్సన్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్-ఇన్-చీఫ్ కల్లి పూరి, రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రెస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ మరియా జఖరోవా, చైనా మీడియా గ్రూప్ యురేషియన్ బ్యూరో డైరెక్టర్ వాంగ్ బిన్ వంటి ప్రముఖులు కీలక విషయాలను పంచుకున్నారు.

ఈ సదస్సులో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్-ఇన్-చీఫ్ కల్లి పూరి మాట్లాడుతూ.. వార్తా సంస్థల్లో కేవలం టెక్నాలజీ మాత్రమే సరిపోదని, నైతిక విలువలు, ఫ్యాక్ట్-చెకింగ్ (నిజనిర్ధారణ), మానవ విచక్షణ అత్యంత అవసరమని నొక్కి చెప్పారు. “సాంప్రదాయ జర్నలిజం వార్తలను ఎడిట్ చేస్తుంది. ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేది గుర్తిస్తుంది. కానీ, ఏఐ అల్గారిథమ్స్ కేవలం లాభాలు, యూజర్ల ఎంగేజ్‌మెంట్ (ఆసక్తి) ఆధారంగా మాత్రమే నడుస్తాయి. వాటికి వార్తల్లోని మంచి చెడ్డలను విశ్లేషించే గుణం ఉండదు. అందుకే ఇండియా టుడే గ్రూప్ ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. కేవలం సాదాసీదాగా ఉండే వార్తల కంటే, రిపోర్టర్లు స్వయంగా చూసిన, విన్న అనుభవాలను పంచుకునేలా “హ్యాండ్‌క్రాఫ్టెడ్ బై ఎడిటర్స్” (ఎడిటర్ల చేతులతో మలిచినవి) అనే ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించింది. ఇది వార్తలకు మరింత బలాన్ని చేకూర్చడమే కాకుండా, పాఠకులతో నేరుగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.” అని కల్లి పూరి వివరించారు. భవిష్యత్తులో ఏఐ, మానవ సృజనాత్మకత రెండూ కలిసే ప్రయాణిస్తాయని చెబుతూ, ప్రస్తుతం తమ న్యూస్‌రూమ్‌లో వాడుతున్న “AI శాండ్‌విచ్” మోడల్‌ను కల్లి పూరి పరిచయం చేశారు. మనం తినే శాండ్‌విచ్‌లో పైన, కింద బ్రెడ్ ముక్కలు ఉండి మధ్యలో స్టఫింగ్ ఉన్నట్లే.. ఈ మోడల్‌లోనూ వార్తా ప్రక్రియ మొదట మనుషులతోనే ప్రారంభమవుతుందని తెలిపారు. మధ్యలో పని వేగాన్ని, ఆస్తికర అంశాలను జోడించడానికి ఏఐ టూల్స్ వాడుకుంటారు. కానీ, ఆ వార్తను చివరిగా ఓకే చేసేది, తుది ముద్ర వేసేది మాత్రం మళ్లీ మనుషులే. అంటే ఫైనల్ అప్రూవల్ పూర్తిగా మానవ నియంత్రణలోనే ఉంటుంది. అలాగే కేవలం ఏఐని వాడటంలోనే కాకుండా, పెద్ద పెద్ద టెక్ కంపెనీలు డెవలప్ చేసిన ఏఐ మోడల్స్ ఆధారంగా సరికొత్త అప్లికేషన్లను సృష్టించడంలోనూ భారత్ ముందంజలో ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

×
×
Ad

మరోవైపు మరియా జఖరోవా సైతం కల్లి పూరి అభిప్రాయాలతో ఏకీభవించారు. ఏఐ అనేది మనుషుల సామర్థ్యాలను పెంచే ఒక సాధనంగానే ఉండాలి తప్ప, మనుషుల స్థానాన్ని భర్తీ చేయకూడదని స్పష్టం చేశారు. ఏఐపై అతిగా ఆధారపడటం వల్ల వచ్చే ప్రమాదాలను హెచ్చరిస్తూ.. ఏఐకి ‘మనస్సాక్షి’ (కన్సైన్స్) ఉండదని గుర్తుచేశారు. ఒక సమాజంగా మనం మానవ విలువల కంటే కేవలం సౌకర్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మానవ వికాసానికి మనస్సాక్షి అనేది ఒక కొలమానం, దాన్ని కోల్పోతే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయని ఆమె అన్నారు. ఇదే చర్చలో చైనాకు చెందిన వాంగ్ బిన్ డేటా సెక్యూరిటీ (సమాచార భద్రత) గురించి ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థలు ఏఐ టూల్స్‌ను ఎక్కువగా వాడుతున్నప్పుడు, ఆ టూల్స్ సిస్టమ్‌లోని కీలక సమాచారాన్ని యాక్సెస్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల సైబర్ సెక్యూరిటీ ముప్పు పెరుగుతుంది. కాబట్టి పని వేగాన్ని పెంచుకుంటూనే సైబర్ భద్రతను కాపాడుకోవడం ఈ రోజుల్లో ఒక పెద్ద సవాల్ అని చెప్పారు. చైనా ప్రస్తుతం మీడియా రంగం కోసమే ప్రత్యేకమైన ఏఐ మోడల్స్‌ను తయారు చేసే పనిలో ఉందని, జాతీయ స్థాయిలో ఒక ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను (మౌలిక సదుపాయాలు) నిర్మించడమే తమ ప్రధాన ప్రాధాన్యత అని వివరించారు. మొత్తంగా చూస్తే.. ఏఐ టెక్నాలజీ అనేది మన జీవితాల్లో భాగమైపోయింది, అది ఇక్కడే ఉంటుంది. కానీ ఏఐ ఎంత వేగంగా దూసుకుపోతున్నా, దానిపై మనుషుల పర్యవేక్షణ, కంట్రోల్ ఉండటం మాత్రం అత్యంత అనివార్యం. మనుషుల ఆలోచనా శక్తి, విచక్షణ తోడైనప్పుడే సాంకేతికత సమాజానికి మేలు చేస్తుంది.