IND vs ZIM: భారత్‌తో టీ20 సిరీస్‌.. జింబాబ్వే జట్టు ప్రకటన.. స్టార్లను కూడా వణికించే పేసర్‌కు చోటు!

Zimbabwe T20 Squad Vs India

Zimbabwe T20 Squad Vs India

Zimbabwe T20 Squad vs India: భారత్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు జింబాబ్వే క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును బుధవారం ప్రకటించింది. సికందర్ రజా సారథ్యంలో బరిలోకి దిగనున్న జింబాబ్వే జట్టులో యువ వికెట్‌కీపర్-బ్యాటర్ తఫాద్జ్వా సిగాకు తొలిసారి టీ20 జట్టులో చోటు దక్కింది. ఇప్పటికే టెస్టు క్రికెట్‌లో జింబాబ్వే తరఫున 10 మ్యాచ్‌లు ఆడిన సిగా.. ఇప్పటివరకు వైట్‌బాల్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయలేదు. భారత్‌తో జరిగే ఈ సిరీస్‌లో అతడు తొలి టీ20 మ్యాచ్ ఆడే అవకాశముంది. టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియాకు సుస్సు పూయించిన పేసర్‌ బ్లెస్సింగ్ ముజరబానీ జట్టులో ఉన్నాడు. అతడితో టీమిండియా ఓపెనర్లకు ముప్పు పొంచి ఉంది.

బంగ్లాదేశ్‌తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో 1-2తో ఓడిన జింబాబ్వే జట్టులో మూడు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. క్లైవ్ మడాండే, టినోటెండా మపోసా, తషింగా ముసెకివా స్థానాల్లో తఫాద్జ్వా సిగా, వెస్లీ మధేవెరె, న్యూమన్ న్యామ్హురిలకు అవకాశం కల్పించారు. వెస్లీ గత ఏడాది జూలై తర్వాత మళ్లీ టీ20 జట్టులోకి వచ్చాడు. ఇప్పటికే అతడు జింబాబ్వే తరఫున 79 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇక పేసర్ న్యూమన్ కూడా గాయం నుంచి కోలుకుని జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గాయం కారణంగా అతడు దూరమైనప్పటికీ.. ఇప్పుడు పూర్తిగా కోలుకుని భారత్‌తో సిరీస్‌కు సిద్ధమయ్యాడు. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన తనాకా చివంగా మంచి ప్రదర్శనతో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

సికందర్ రజా నాయకత్వంలో ఇటీవల జింబాబ్వే చరిత్రాత్మక విజయాలు నమోదు చేసింది. బంగ్లాదేశ్‌పై ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ విజయం సాధించడంతో పాటు వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అయితే టీ20 సిరీస్‌ను మాత్రం 1-2తో కోల్పోయింది. మరోవైపు టీ20 ప్రపంచ కప్ 2026 గెలిచిన తర్వాత భారత్ వరుస పరాజయాలు ఎదుర్కొంది. ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌ను 0-2తో, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ను 0-4తో కోల్పోయింది. ఇరు జట్లు చివరిసారిగా టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8 దశలో తలపడ్డాయి. చెన్నై వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. స్వదేశంలో జరుగుతున్న ఈ సిరీస్‌లో భారత్‌కు గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది.

జట్లు:
భారత్ జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్‌కీపర్), రవి బిష్ణోయ్.
జింబాబ్వే జట్టు: సికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, తనాకా చివంగా, బెన్ కరన్, బ్రాడ్ ఎవాన్స్, వెస్లీ మధేవెరె, తడియవానాషే మరుమాని (వికెట్‌కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీ, డియోన్ మేయర్స్, రిచర్డ్ నగరవా, న్యూమన్ న్యామ్హురి, మిల్టన్ షుంబా, తఫాద్జ్వా సిగా (వికెట్‌కీపర్).

భారత్-జింబాబ్వే టీ20 సిరీస్ షెడ్యూల్:
మొదటి టీ20: జూలై 23 – హరారే స్పోర్ట్స్ క్లబ్
రెండో టీ20: జూలై 25 – హరారే స్పోర్ట్స్ క్లబ్
మూడో టీ20: జూలై 27 – హరారే స్పోర్ట్స్ క్లబ్