Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!

  • ఉత్కంఠభరితంగా భారత్-ఎ, శ్రీలంక-ఎ మ్యాచ్
  • శ్రీలంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగిన వైభవ్
  • సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే
Vaibhav Sooryavanshi Controversy

Vaibhav Sooryavanshi Controversy

Reason behind Vaibhav Suryavanshi’s Anger: శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగడమే కాకుండా.. వివాదానికి కూడా దారితీసింది. మ్యాచ్ టై కావడం, సూపర్ ఓవర్‌లో శ్రీలంక విజయం సాధించడం, అనంతరం భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎవరు ఏమన్నా సైలెంట్‌గా ఉండే వైభవ్.. ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు. బుడ్డోడి ఆగ్రహానికి కారణం ఏంటో తాజాగా వెలుగులోకి వచ్చింది.

మ్యాచ్ అయిపోయింది.. ఇంటికి వెళ్లిపో:

క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. సూపర్ ఓవర్ ముగిసిన తర్వాత వైభవ్ సూర్యవంశీని శ్రీలంక ఆటగాడు విశెన్ హలంబగే హేళన చేశాడు. ‘మ్యాచ్ అయిపోయింది.. ఇప్పుడు ఇంటికి వెళ్లిపో’ అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన వైభవ్.. హలంబగేతో వాగ్వాదానికి దిగాడు. పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారడంతో ఇరు జట్ల ఆటగాళ్లు, అధికారులు జోక్యం చేసుకుని వారిని విడదీశారు. దాంతో కొంతసేపు మైదానంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

×
×
Ad

సూపర్ ఓవర్ నిర్వహణపై భారీ గందరగోళం:

మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించాలా లేదా అన్న అంశంపై కూడా పెద్ద చర్చ జరిగింది. భారత కెప్టెన్ తిలక్ వర్మ సూపర్ ఓవర్ తప్పనిసరిగా నిర్వహించాలని అంపైర్లతో వాదించాడు. మరోవైపు శ్రీలంక జట్టు మాత్రం మ్యాచ్‌ను సూపర్ ఓవర్ ద్వారా నిర్ణయించకూడదనే అభిప్రాయంలో ఉందట. చర్చల అనంతరం స్టేడియంలో వెలుతురు సరిగా లేకపోయినా చివరకు సూపర్ ఓవర్ నిర్వహించేందుకు అంపర్లు అంగీకరించారు.భారత్ బ్యాటింగ్ సమయంలో వెలుతురు మరింత తగ్గితే ఆటను నిలిపివేస్తామని అంపైర్లు ముందుగా చెప్పినప్పటికీ.. తర్వాత ఆ నిర్ణయాన్ని అమలు చేయలేదట.

సూపర్ ఓవర్‌లో శ్రీలంక విజయం:

సూపర్ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 16 పరుగులు చేసింది. అనంతరం 17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. వైభవ్ సూర్యవంశీ, సుర్యాంశ్ షెడ్జే క్రీజులో ఉన్నప్పటికీ భారత్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. దాంతో లంక 7 పరుగుల తేడాతో విజయం నమోదు చేసి.. ఫైనల్ అవకాశాలను మరింత బలపర్చుకుంది. ఈ మ్యాచ్‌లో మరో కీలక మలుపు భారత జట్టుకు విధించిన 10 పరుగుల పెనాల్టీ. భారత ఆల్‌రౌండర్ విప్రాజ్ నిగమ్ పిచ్‌లో రెండుసార్లు పరుగెత్తినందుకు అంపైర్లు ఈ ఫైన్ విధించారు. దీంతో శ్రీలంక తమ ఛేదనను 10/0 స్కోరుతో ప్రారంభించింది. చివరకు మ్యాచ్ టై కావడంతో ఆ 10 పెనాల్టీ పరుగులే భారత్ ఓటమికి ప్రధాన కారణమయ్యాయి.

శ్రీలంక డ్రెస్సింగ్‌రూమ్‌లో క్షమాపణల చర్చ?:

మ్యాచ్ అనంతరం శ్రీలంక డ్రెస్సింగ్‌రూమ్‌లో కూడా ఈ ఘటనపై చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా వెలుతురు సరిపోని పరిస్థితుల్లో సూపర్ ఓవర్ నిర్వహించడం, అనంతరం చోటుచేసుకున్న వివాదాల నేపథ్యంలో భారత జట్టుకు క్షమాపణ చెప్పాలనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. సాధారణంగా ‘ఎ’ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లలో ఐసీసీ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం అరుదు. అయినప్పటికీ ఆటగాళ్ల మధ్య జరిగిన ఈ ఘర్షణపై మ్యాచ్ రిఫరీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.