Tilak Varma Heap Praises on Sahan Arachchige: ట్రై నేషన్ ఏ సిరీస్ 2026లో భాగంగా శ్రీలంకలో జరిగిన మ్యాచ్లో భారత్-ఏ ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. ముందుగా భారత్ 6 వికెట్లకు 277 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (101) సెంచరీ చేయగా.. కెప్టెన్ తిలక్ వర్మ (60) హాఫ్ సెంచరీతో రాణించాడు. టీమిండియా బౌలర్ల ధాటికి ఛేదనలో లంక 48.5 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ తిలక్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు విజయానికి బౌలర్ల పోరాటమే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. శ్రీలంక కెప్టెన్ సహన్ అరచ్చిగే (74) అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని ప్రశంసించాడు.
ఓటమి తప్పదనుకున్నా:
సహన్ అరచ్చిగే క్రీజులో ఉన్నంత సేపు టెన్షన్ పడ్డామని, ఓ సమయంలో అయితే ఓటమి తప్పదనుకున్నా అని తిలక్ వర్మ తెలిపాడు. ‘సహన్ చాలా బాగా ఆడాడు. అతడు క్రీజులో ఉన్నంత వరకు మ్యాచ్ శ్రీలంక వైపు వైపే ఉంది. ఓటమి తప్పదు అనుకున్నా. అయితే అన్షుల్ కాంబోజ్ అద్భుత యార్కర్కు సహన్ ఔట్ కావడం మ్యాచ్లో కీలక మలుపు. ఆ వికెట్ తర్వాతే మ్యాచ్ పూర్తిగా మా వైపు తిరిగింది’ అని తిలక్ చెప్పాడు. భారత్-ఏ బౌలర్ల ప్రదర్శనపై కూడా ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా ఆరంభ స్పెల్లో అంతగా ప్రభావం చూపలేకపోయిన అర్షద్ ఖాన్, అన్షుల్ చివర్లో అద్భుతంగా బౌలింగ్ చేశారని కొనియాడాడు. ‘మా ఓపెనింగ్ బౌలర్లు తొలి స్పెల్లో ఆశించిన స్థాయిలో బౌలింగ్ చేయలేదు. కానీ ఇన్నింగ్స్ చివరిలో వారు మ్యాచ్ను ముగించిన తీరు అద్భుతం. ఒత్తిడి సమయంలో వారు చూపిన ఆత్మవిశ్వాసం అద్భుతం’ అని తిలక్ అన్నాడు.
అలాంటిది జరగలేదు:
పిచ్ పరిస్థితుల గురించి తిలక్ వర్మ మాట్లాడుతూ.. ‘రెండో ఇన్నింగ్స్లో వికెట్ మరింత నెమ్మదిస్తుందని భావించాము. నిజం చెప్పాలంటే పిచ్లో పెద్దగా మార్పు లేదు. రెండో ఇన్నింగ్స్లో మరింత స్లో అవుతుందని అనుకున్నా కానీ అలాంటిది జరగలేదు. టాస్ సమయంలోనే 270 పరుగులు మంచి స్కోరు అని చెప్పాను. ఈ మ్యాచ్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. మేము ఎక్కడ మెరుగుపడాలో చర్చిస్తాం. ముఖ్యంగా సరైన ప్రాంతాల్లో బౌలింగ్ చేయడంపై దృష్టి పెడతాం. తదుపరి మ్యాచ్లో మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తాం’ అని తెలిపాడు.
ఎంత పోటీ ఉంటుందో మాకు తెలుసు:
‘టోర్నీ ప్రారంభానికి ముందే నేను చెప్పాను. శ్రీలంక, అఫ్గానిస్థాన్ మంచి జట్లు. ముఖ్యంగా శ్రీలంకలో ఆడటం అంత సులువు కాదు. ఇటీవల భారత జట్టుపై లంక వన్డే సిరీస్ గెలిచింది. అందుకే ఈ టోర్నీలో ఎంత పోటీ ఉంటుందో మాకు తెలుసు. అందుకు అనుగుణంగా మేము సిద్ధమయ్యాం. తొలి మ్యాచ్లో విజయం మా ఖాతాలో పడటం ఆనందంగా ఉంది’ అని తిలక్ వర్మ పేర్కొన్నాడు. రుతురాజ్ సెంచరీ, తిలక్ అర్ధశతకం, బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో భారత్-ఏ జట్టు ట్రై నేషన్ సిరీస్ను విజయంతో ప్రారంభించింది. ఈ విజయం జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా టోర్నీలో ముందుకు వెళ్లేందుకు మంచి పునాది వేసింది.

