సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులకు అదిరే శుభవార్త వచ్చింది. వెన్నునొప్పి కారణంగా గత నెల రోజులుగా క్రికెట్కు దూరమైన కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించి మైదానంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యాడు. ఐపీఎల్ కీలక దశకు చేరుకున్న తరుణంలో కమిన్స్ రాక జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సీజన్లో కమిన్స్ లేని లోటును భర్తీ చేస్తూ ఇషాన్ కిషన్ తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించాడు. కిషన్ నాయకత్వంలో ఆడిన 7 మ్యాచ్ల్లో SRH 4 విజయాలను సాధించి ప్లే-ఆఫ్స్ రేసులో బలంగా నిలిచింది. వన్ డౌన్ లో వస్తున్న కిషన్ రాణిస్తున్నప్పటికీ, జట్టు డెత్ ఓవర్ల బౌలింగ్లో, ఫీల్డ్ సెట్టింగ్లో కమిన్స్ వంటి అనుభవజ్ఞుడైన నాయకుడి అవసరం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం జట్టు పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉన్నందున, మిగిలిన మ్యాచ్లు చాలా కీలకం కానున్నాయి.
ప్యాట్ కమిన్స్ కేవలం ఒక బౌలర్ మాత్రమే కాదు, ప్రపంచకప్ గెలిచిన అద్భుతమైన వ్యూహకర్త. క్లిష్ట సమయాల్లో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడంలో కమిన్స్ దిట్ట. ఇది యువ బౌలర్లకు కొండంత అండగా ఉంటుంది. దిల్షాన్ మధుశంక స్థానంలో కమిన్స్ నేరుగా తుది జట్టులోకి రానున్నాడు. దీనివల్ల పవర్ ప్లే , డెత్ ఓవర్లలో జట్టు బౌలింగ్ విభాగం మరింత పటిష్టమవుతుంది.
ఐపీఎల్తో పాటు రాబోయే టీ20 వరల్డ్ కప్కు కూడా దూరమవుతాడన్న వార్తలకు స్వస్తి పలుకుతూ, కమిన్స్ ఫిట్నెస్ సాధించడం ఆస్ట్రేలియాకు కూడా పెద్ద ఊరట. రానున్న శనివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్లో కమిన్స్ మళ్ళీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. తాను జట్టులోకి వస్తున్నట్లు ఆయనే స్వయంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ధృవీకరించడంతో ఆరెంజ్ ఆర్మీ ఫుల్ ఖుషీగా ఉంది.
