Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్‌ చూస్తున్నాడా?

Kuldeep Yadav

Kuldeep Yadav

Kuldeep Yadav 10 wickets: భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరోసారి సత్తా చాటాడు. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో యార్క్‌షైర్ తరఫున బరిలోకి దిగిన అతడు.. ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్లు పడగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అద్భుతంగా బౌలింగ్ చేసిన మణికట్టు స్పిన్నర్ కుల్దీప్.. భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు, ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు తన ప్రదర్శనతో గట్టి సందేశం పంపాడు.

ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్ 4 వికెట్లు పడగొట్టగా.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లు తీశాడు. మొత్తంగా 10/120తో మ్యాచ్‌ను ముగించాడు. బంతితో అద్భుత ప్రదర్శన చేయడంతో పాటు బ్యాట్‌తోనూ కుల్దీప్ కీలక పరుగులు చేశాడు. 36 పరుగులు చేయడంతో యార్క్‌షైర్ 390 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతకుముందు ఎసెక్స్ 284 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ అనంతరం కుల్దీప్ మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ పిచ్‌పై బౌలింగ్ చేయడం ఎంతో సౌకర్యంగా అనిపించిందని చెప్పాడు. ఈ వికెట్‌పై బంతిని వేగంగా వేయాల్సిన అవసరం లేదని, పిచ్‌లోనే మంచి వేగం ఉందని వివరించాడు. బంతి పిచ్ అయిన తర్వాత కొంత వేగం కనిపించడంతో.. బంతిని ఎక్కువగా టర్న్ చేయడంతో వికెట్స్ దక్కాయని చెప్పాడు.

భారత్‌లోని పరిస్థితులతో పోలిస్తే ఇంగ్లాండ్‌లోని పిచ్‌లు పూర్తిగా భిన్నంగా ఉంటాయని కుల్దీప్ తెలిపాడు. భారత పిచ్‌లపై స్పిన్ ఎక్కువగా లభించినప్పటికీ వికెట్లు నెమ్మదిగా ఉంటాయని, దీంతో బ్యాటర్లు పరిస్థితులకు తగ్గట్టుగా తమ ఆటను మార్చుకునే అవకాశం ఉంటుందని చెప్పాడు. ఇంగ్లాండ్‌లో పిచ్‌లోని వేగం కారణంగా బ్యాటర్లు బ్యాక్ ఫుట్ మీద ఆడితే ఇబ్బందుల్లో పడతారని, ముందుకు వచ్చి ఆడాల్సి ఉంటుందని వివరించాడు. అలాంటి సమయంలో క్యాచ్‌లు, స్లిప్, షార్ట్ లెగ్ వంటి ఫీల్డింగ్ స్థానాల్లో వికెట్లు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పాడు. కుల్దీప్ యాదవ్‌కు ఈ ప్రదర్శన ఎంతో కీలకమైనదిగా మారింది. రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత భారత టెస్టు జట్టులో అతడికి మరిన్ని అవకాశాలు వస్తాయని భావించినప్పటికీ.. తుది జట్టులో స్థానం మాత్రం దక్కడం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ కుల్దీప్‌కు తరచూ చోటు లభిస్తున్నప్పటికీ.. ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం అవకాశం పెద్దగా రావడం లేదు.

బ్యాటింగ్‌లోనూ సహకారం అందించే బౌలర్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు భావిస్తున్న గౌతమ్ గంభీర్ విధానంలో కుల్దీప్ కు అవకాశాలు పరిమితమవుతున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ వంటి ఆల్‌రౌండర్లకు అవకాశాలు లభిస్తుండగా.. మానవ్ సుతార్, సారాంశ్ జైన్ వంటి స్పిన్నర్లు కూడా జట్టు ఎంపికల్లో ముందున్నారు. 2017లో టెస్టు అరంగేట్రం చేసిన కుల్దీప్ ఇప్పటివరకు భారత్ తరఫున కేవలం 19 టెస్టులు మాత్రమే ఆడాడు. తొలి దశలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా జోడీ కారణంగా కూడా అతడికి తుది జట్టులో అవకాశం దక్కలేదు. అయితే ఎడమచేతి మణికట్టు స్పిన్నర్‌గా కుల్దీప్‌కు ఉన్న ప్రత్యేకత ప్రపంచ క్రికెట్‌లోనే అరుదైనది. కుల్దీప్‌కు ఇకనైనా తుది జట్టులో వరుస అవకాశాలు దక్కుతాయా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.