Site icon NTV Telugu

Jhulan Goswami: కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడేసిన జులన్ గోస్వామి.. కన్నీటి పర్యంతమైన హర్మన్‌ప్రీత్‌కౌర్

Julan Goswami

Julan Goswami

Jhulan Goswami: టీమిండియా మహిళా జట్టు దిగ్గజ పేసర్ జూలన్ గోస్వామి తన కెరీర్‌లో చిట్టచివరి మ్యాచ్ ఆడేసింది. ఈరోజు ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే ఆమెకు చివరి మ్యాచ్. అయితే ఆఖరి మ్యాచ్‌లో జూలన్ గోస్వామి బ్యాటింగ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరగడం అభిమానులను నిరాశపరిచింది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు జూలన్ గోస్వామిని భారత జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రత్యేకంగా గౌరవించింది. ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్‌కౌర్ కన్నీటిపర్యంతమైంది. అటు జులన్ గోస్వామి కూడా భావోద్వేగానికి గురైంది. తన కెరీర్‌కు అండగా నిలిచిన బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌తో పాటు తన కుటుంబ సభ్యులు, కోచ్‌లకు ఆమె కృతజ్ఞతలు చెప్పింది. కెరీర్ వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేయడంపై కూడా జులాన్ సంతోషం వ్యక్తం చేసింది. జీవితంలో ఈ క్షణం ఎంతో మధరమైందని పేర్కొంది.

కాగా 2002లో ఇంగ్లండ్ జట్టుతోనే కెరీర్ ప్రారంభించిన తాను మళ్లీ అదే జట్టుతో వీడ్కోలు మ్యాచ్ ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని జులన్ గోస్వామి తెలిపింది. ముఖ్యంగా 2-0తో సిరీస్ గెలవడం మరింత సంతోషాన్నించ్చిందని పేర్కొంది. మిథాలీ రాజ్‌‌తో పాటు ఇండియా మహిళల జట్టులో కీలక ప్లేయర్‌గా జులన్ గోస్వామి పేరు సంపాదించింది. ఇది ఆమెకు 204వ ఇంటర్నేషనల్‌‌ మ్యాచ్‌‌. కెరీర్‌లో ఆమెకు వరల్డ్‌‌ కప్‌‌ను ముద్దాడే అవకాశం దక్కలేదు. అటు ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో జులన్ గోస్వామి 2 వికెట్లతో రాణించింది. ఈ మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలవడంతో 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి జులన్ గోస్వామికి టీమిండియా ఘనమైన వీడ్కోలు పలికింది.

Exit mobile version