Shreyas Iyer Captaincy: శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు.. మ్యాచ్ మొత్తం తప్పిదాలే?

  • పీబీకేఎస్ వరుసగా నాలుగో పరాజయం
  • శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు
  • మ్యాచ్ మొత్తం శ్రేయస్ తప్పిదాలే?
Shreyas Iyer Captaincy

Shreyas Iyer Captaincy

Shreyas Iyer Mistakes in PBKS vs DC IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) వరుసగా నాలుగో పరాజయం ఎదుర్కొంది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ)తో జరిగిన మ్యాచ్‌లో పీబీకేఎస్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ముందుగా పీబీకేఎస్ 5 వికెట్ల నష్టానికి 210 రన్స్ చేయగా.. లక్ష్యాన్ని డీసీ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ ఓటమితో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. కీలక మ్యాచ్‌లో బౌలర్లను ఉపయోగించడంలో చేసిన పొరపాట్లు జట్టు ఓటమికి ప్రధాన కారణమయ్యాయని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా డెత్ ఓవర్ల బౌలింగ్ మేనేజ్‌మెంట్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పంజాబ్ కింగ్స్ జట్టులో అత్యంత నమ్మకమైన డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌గా పేరున్న అర్ష్‌దీప్ సింగ్‌ ఓవర్లను శ్రేయస్ అయ్యర్ త్వరగా పూర్తి చేశాడనే విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా చివరి ఓవర్లలో కీలకంగా బౌలింగ్ చేసే అర్ష్‌దీప్.. నాలుగు ఓవర్ల కోటాను 15వ ఓవర్‌కే పూర్తి చేయించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో చివరి ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి తీసుకురాగల ప్రధాన ఆయుధాన్ని పంజాబ్ కోల్పోయింది. అంతేకాదు దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్‌ను కూడా 16వ ఓవర్‌కే పూర్తి చేయించడం మరో పెద్ద తప్పిదంగా మారింది. డెత్ ఓవర్లలో తన ఎత్తు, బౌన్స్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల జాన్సెన్‌ను ముందుగానే ఉపయోగించడంతో పంజాబ్ బౌలింగ్ బలహీనపడింది. కీలక సమయంలో అనుభవజ్ఞులైన బౌలర్లు లేకపోవడం ప్రత్యర్థి జట్టుకు కలిసొచ్చింది.

మరో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు శ్రేయస్ అయ్యర్ ఒక్క ఓవర్ కూడా ఇవ్వకపోవడం. మధ్య ఓవర్లలో వికెట్లు తీసే సామర్థ్యం ఉన్న చాహల్‌ను పూర్తిగా పక్కనపెట్టడం అభిమానులను భారీ షాక్‌కు గురిచేసింది. పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉన్నా కూడా చాహల్‌ను ఉపయోగించకపోవడం కెప్టెన్సీ వైఫల్యంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. డెత్ ఓవర్లలో అనుభవజ్ఞుల బదులు అరంగేట్రం చేసిన బెన్ ద్వార్షుయిస్‌కు బంతి ఇవ్వడం కూడా పెద్ద రిస్క్‌గా మారింది. ఒత్తిడితో కూడిన కీలక సమయంలో కొత్త బౌలర్‌పై ఆధారపడటం జట్టుకు నష్టంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరోవైపు యశ్ ఠాకూర్‌ను డెత్ ఓవర్ బౌలర్‌గా ఉపయోగించడం కూడా అభిమానులను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటివరకు యశ్ డెత్ ఓవర్ పాత్రలో పెద్దగా కనిపించకపోయినా.. కీలక సమయంలో అతడిపై బాధ్యతలు వేయడం ఫలించలేదు. ఈ నిర్ణయాలన్నీ కలిపి చూస్తే.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఈ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. ప్లేఆఫ్స్ రేసు కీలక దశకు చేరుకున్న సమయంలో ఇలాంటి వ్యూహాత్మక తప్పిదాలు పంజాబ్ కింగ్స్‌కు భారీ నష్టాన్ని మిగిల్చే అవకాశముంది. సోషల్ మీడియాలో అభిమానులు కూడా ‘ఇది ఐపీఎల్ మ్యాచ్‌లా లేక ప్రయోగాల మైదానమా?’ అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.