Site icon NTV Telugu

Ruturaj Gaikwad: కన్నీరు దిగమింగుతూ జట్టు కోసం ఆడాడు.. ఈ విజయం అతడికే అంకితం!

Ruturaj Gaikwad Statement

Ruturaj Gaikwad Statement

Ruturaj Gaikwad on Mukesh Choudhary: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం వాంఖడేలో ముంబై ఇండియన్స్‌ (ఎంఐ)తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఘన విజయాన్ని అందుకుంది. ముందుగా చెన్నై 207 రన్స్ చేయగా.. ముంబై 104 పరుగులకే ఆలౌట్ అయింది. 103 పరుగుల తేడాతో సీఎస్‌కే విజయం సాధించినా.. మ్యాచ్‌లో పేసర్ ముకేశ్‌ చౌదరి స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. తల్లి మరణించిన బాధను దిగమింగుతూ.. తన బాధ్యతగా ముంబైతో మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 31 రన్స్ ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. సీఎస్‌కే విజయం అనంతరం కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్‌ మాట్లాడుతూ.. ఈ విజయాన్ని ముకేశ్‌కు అంకితం చేస్తున్నట్లు తెలిపాడు.

‘వ్యక్తిగతంగా క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడి జట్టు కోసం తిరిగి రావడం అంత సులభం కాదు. ముకేశ్‌ చౌదరికే ఇది కఠిన సమయం. మానసికంగా ఎంతో బలంగా నిలబడ్డాడు. జట్టుకు అతని అవసరం ఉన్నందున తిరిగి వచ్చి అద్భుతంగా బౌలింగ్ చేయడం గొప్ప విషయం. ఈ విజయం అతడికే అంకితం. బౌలింగ్‌కు వెళ్లే ముందు కూడా మ్యాచ్‌ను అతని కోసం గెలుద్దామని మేమంతా మాట్లాడుకున్నాం. అందరూ తమ వంతు కృషి చేసి అతనికి అండగా నిలవడం సంతోషంగా ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో జట్టు కోసం ఆడిన ముకేశ్‌ అద్భుతం’ అని రుతురాజ్‌ గైక్వాడ్‌ ప్రశంసించాడు. ముకేశ్‌ తల్లి ప్రేమ్ దేవి ఇటీవల మరణించారు. శనివారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం ముకేశ్‌ రాజస్థాన్‌లోని తన స్వస్థలం భిల్వారాకు వెళ్లాడు. తల్లి అంత్యక్రియలు పూర్తి చేసి.. ముంబైతో మ్యాచ్ ప్రారంభానికి ఒక రోజు ముందే సీఎస్‌కే క్యాంప్‌లో చేరాడు. వ్యక్తిగత విషాదంలో ఉన్నా.. జట్టు అవసరాల కోసం బరిలోకి దిగడం అందరినీ కలిచివేసింది.

‘మ్యాచ్ గెలవడం చాలా సంతోషంగా ఉంది. టాస్ సమయంలో నేను కాస్త అయోమయంలో ఉన్నాను. నా మనసలో ముందుగా బ్యాటింగ్ చేయాలని అనుకున్నా. పిచ్ కొంచెం పచ్చగా కనిపించినా.. డ్రైగా కూడా అనిపించింది. మొదటి కొన్ని ఓవర్లలో పిచ్ ఎలా ఉందో అంచనా వేయాలి. నేను, సంజు మాట్లాడుకున్నప్పుడు బంతి సరిగా బ్యాట్‌పైకి రావడం లేదని అర్థమైంది. 200-210 స్కోర్ మంచి స్కోర్ అవుతుందని భావించాం. అకీల్ బౌలింగ్‌ చేయడం జట్టుకు ఉపయోగపడింది. అందరూ తమ వంతు కృషి చేశారు. బ్రేవిస్, కార్తిక్ చేసిన 20 పరుగుల ఇన్నింగ్స్ కూడా కీలకం అయ్యాయి. మ్యాచ్ మోమెంటమ్ కొనసాగింది. సంజు మళ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. అతను అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. మా బౌలింగ్ కూడా మెరుగుపడుతోంది. మేము ప్రశాంతంగా ఉండి బేసిక్స్‌ను సరిగ్గా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు అవి ఫలిస్తున్నాయి’ అని రుతురాజ్‌ చెప్పాడు.

‘మేము అన్ని కోణాల్లో బలంగా ఉండేలా ప్రయత్నిస్తున్నాం. ఖలీల్ అందుబాటులో లేకపోయినా ముకేశ్ ఉన్నాడు. పవర్‌ప్లేలో సూర్య, తిలక్‌లకు మూడు ఓవర్లు వేయడం కూడా మంచి ఆరంభం ఇచ్చింది. అన్షుల్ ఎప్పుడూ బాగా బౌలింగ్ చేస్తాడు. పిచ్‌లో పేస్, బౌన్స్ ఉంటే జేమీ, గుర్జప్నీత్ మధ్య ఓవర్లలో వికెట్లు తీయగలరు. మాకు నూర్ కూడా ఉన్నాడు. జట్టులో అకీల్ లాంటి ప్లేయర్ ఉండడం కలిసొస్తుంది. అందరూ ప్రశాంతంగా ఆడుతున్నారు. ప్రతి మ్యాచ్‌ను మళ్లీ కొత్తగా ప్రారంభించాలి. పిచ్ పరిస్థితులను అంచనా వేయాలి. త్వరలోనే డే మ్యాచ్ కూడా ఉంది. కాబట్టి ఈ విజయాన్ని ఆస్వాదించి.. తదుపరి మ్యాచ్‌కు సిద్ధం కావాలి’ అని చెన్నై కెప్టెన్ తెలిపాడు.

Exit mobile version