NTV Telugu Site icon

IPL 2021 : చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

చెన్నై సూప‌ర్ కింగ్స్‌పై రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఘ‌న విజ‌యం సాధించింది. శ‌నివారం అబుదాబిలో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో త‌న ఫ్లేఆఫ్అవ‌కాశాల‌ను స‌జీవంగా ఉంచుకుంది. య‌శ‌స్వీ జైశ్వాల్, శివ‌మ్ దూబే.. హాఫ్‌ సెంచరీలతో చెలరేగడంతో.. చెన్నై నిర్దేశించిన 190 పరుల భారీ లక్ష్యాన్ని మరో రెండు ఓవర్లు మిగిలుండగానే.. ఛేదించింది రాజస్థాన్‌. చెన్నై బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ 2 వికెట్లు తీశాడు. అంత‌కుముందు చెన్నై సూప‌ర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 189 ప‌రుగులు చేసింది.

రుతురాజ్ గైక్వాడ్… 60 బంతుల్లో సెంచరీ చేసి దుమ్మురేపాడు. . ఆఖర్లో వచ్చిన రవీంద్ర జడేజా కూడా రెచ్చిపోయి ఆడటంతో.. భారీ స్కోర్‌ చేసింది చెన్నై. రాజస్థాన్‌ బౌలర్లలో రాహుల్ తెవాటియా మూడు, చేతన్‌ సకారియా ఒక వికెట్ తీసుకున్నారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై.. మరోసారి నిరాశపరిచింది. హ్యాట్రిక్‌ పరాజయాల తర్వాత గత మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిచిన రోహిత్‌ సేన… కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓడింది.

ముంబైపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది ఢిల్లీ క్యాపిటల్స్‌. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది. 33 రన్స్‌ చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌ టాప్‌ స్కోరర్‌ గా నిలిచాడు. మిగితా బ్యాట్స్‌మెన్‌ నిరాశపరిచారు. ఢిల్లీ బౌలర్లలో అవేశ్‌ ఖాన్‌, అక్షర్‌ పటేల్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ… మొదట్లో తలపడినా 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ చివరి వరకు నిలిచి.. జట్టు విజయానికి బాటలు వేశాడు. ముంబై బౌలర్లలో బౌల్ట్‌, జయంత్‌, కృనాల్‌, బుమ్రా, కౌల్టర్‌నైల్‌ తలా ఒక వికెట్‌ తీశారు.