PBKS Captain Shreyas Iyer: చాలా బాధగా ఉంది.. మా విజయాన్ని ఆ ‘ఒక్కడు’ లాగేసుకున్నాడు!

  • ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్‌కు మరో ఓటమి
  • ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో ఓటమి
  • పంజాబ్ పరాజయంపై స్పందించిన శ్రేయస్
Pbks Captain Shreyas Iyer

Pbks Captain Shreyas Iyer

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026లో పంజాబ్ కింగ్స్‌కు మరో నిరాశ ఎదురైంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో చివరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. లీగ్‌ మొదటి భాగంలో అజేయంగా సాగిపోతూ అలవోకగా ప్లేఆఫ్స్‌కు వెళ్లేలా కనిపించిన పంజాబ్‌.. రెండో భాగంలో తడబడింది. వరుసగా అయిదో ఓటమితో ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ముంబై పరాజయం అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ.. చాలా బాధగా ఉందని, ఇది జీర్ణించుకోవడానికి కఠినమైది అని పేర్కొన్నాడు. అయితే ఓటమికి ఒక్క కారణాన్ని మాత్రమే చూపించాలనుకోవడం లేదన్నాడు. ఇది అభిమానులకు అద్భుతమైన క్రికెట్ మ్యాచ్‌గా నిలిచిందని శ్రేయస్ చెప్పాడు.

మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘ఇది నిజంగా చాలా కఠినమైన ఓటమి. కానీ ఏ ఒక్క పరిస్థితినీ కారణంగా చూపించాలనుకోవడం లేదు. ఇది గొప్ప క్రికెట్ మ్యాచ్. రెండు జట్లు అద్భుతంగా పోరాడాయి. తిలక్ వర్మ అద్భుతంగా ఆడాడు. అతడి షాట్ల ఎంపిక చాలా బాగుంది. ఫీల్డ్‌ను చక్కగా ఉపయోగించుకున్నాడు. అతడికి పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. మా నుంచి విజయాన్ని తిలక్ లాగేశాడు’ అని అన్నాడు. ఈ మ్యాచ్‌లో తెలుగు ప్లేయర్ తిలక్‌ వర్మ హాఫ్ సెంచరీ బాదాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో 75 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.

అజ్మతుల్లా ఒమర్జాయ్ ఆడిన ఇన్నింగ్స్‌పై కూడా శ్రేయస్ అయ్యర్ ప్రత్యేకంగా స్పందించాడు. ‘ఒక దశలో మేము 170 నుంచి 180 పరుగుల మధ్య స్కోర్ చేస్తామనుకున్నాం. కానీ అజ్మత్ ఇన్నింగ్స్ పూర్తిగా మ్యాచ్ మోమెంటమ్ మార్చేసింది. ముఖ్యంగా 16వ, 17వ ఓవర్లలో అతడు కొట్టిన స్కూప్ సిక్సర్లు మాకు భారీ ఊపు ఇచ్చాయి. అతడి కారణంగానే మేము 200 పరుగుల మార్క్ చేరుకోగలిగాం. అది నిజంగా ప్రశంసనీయమైన ఇన్నింగ్స్’ అని శ్రేయస్ కొనియాడాడు.

వచ్చే మ్యాచ్‌లో పటిష్ట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడడంపై శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. ‘తదుపరి మ్యాచ్ కోసం మేమంతా ఉత్సాహంగా ఉన్నాం. అది మధ్యాహ్నం మ్యాచ్. ఇప్పుడు మాకు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు తప్పనిసరి. ఆ రెండు మ్యాచ్‌లు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. మేము మంచి క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు. పంజాబ్ కింగ్స్ వరుస ఓటములతో ప్లేఆఫ్స్ అవకాశాలను క్లిష్టం చేసుకున్నప్పటికీ.. జట్టు ఇంకా పోరాటాన్ని కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇప్పుడు ఆర్సీబీతో జరిగే మ్యాచ్ పంజాబ్‌కు ‘డూ ఆర్ డై’గా మారింది.