ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగిసి క్వాలిఫయర్ 1 పోరుకు తెరలేచింది. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరగబోయే కీలక మ్యాచ్కు ముందు టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్లపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఐపీఎల్ చరిత్రలోనే వీరు అత్యుత్తమ బ్యాటింగ్ జోడీ అని రైనా కొనియాడారు. వారి మధ్య ఉన్న పరుగుల సమన్వయం, భాగస్వామ్యాలు నిర్మించే తీరు మరే ఇతర ఓపెనింగ్ జోడీకి లేదని ఆయన స్పష్టం చేశారు.
రికార్డుల జోడీ..
ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు గిల్, సాయి సుదర్శన్ వెన్నుముకగా నిలిచారు. ఇటీవల వీరిద్దరూ కలిసి టీ20 క్రికెట్లో 10వ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి.. విరాట్ కోహ్లీ-క్రిస్ గేల్, కోహ్లీ-ఏబీ డివిలియర్స్, బాబర్ ఆజం-మహ్మద్ రిజ్వాన్ వంటి దిగ్గజ జోడీల రికార్డులను సమం చేశారు.
రైనా మాట్లాడుతూ.. “ఐపీఎల్ చరిత్రలో శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అత్యంత మేలైన బ్యాటింగ్ జోడీ. వీరు కలిసి ఆడిన 46 ఇన్నింగ్స్లలో 21 సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐపీఎల్లో అతి తక్కువ ఇన్నింగ్స్లలో ఈ ఘనత సాధించిన వేగవంతమైన జోడీ ఇదే. క్రిస్ గేల్-కోహ్లీ జోడీ 21 యాభై పరుగుల భాగస్వామ్యాల కోసం 59 ఇన్నింగ్స్లు తీసుకోగా, డివిలియర్స్-కోహ్లీ జోడీకి 76 ఇన్నింగ్స్లు పట్టింది” అని గణాంకాలతో సహా వివరించారు.
అనవసర రిస్క్ లేని క్లాస్ బ్యాటింగ్..
ఈ ఇద్దరి బ్యాటింగ్ శైలి గురించి భారత మాజీ పేసర్ ఉమేష్ యాదవ్ కూడా ప్రశంసలు గుప్పించారు. “ఈ ఇద్దరు బ్యాటర్లు పవర్ప్లేను ఉపయోగించుకునే తీరు అద్భుతం. వీరు ఎలాంటి అనవసరమైన రిస్క్ షాట్లు ఆడరు. చాలా ప్రశాంతంగా బ్యాటింగ్ చేస్తారు, అసలు పరుగులు వస్తున్నాయా లేదా అనే అనుమానం కలుగుతుంది. కానీ పవర్ప్లే ముగిసేసరికి బోర్డుపై 60 పరుగులు కనిపిస్తాయి. అది వారి క్లాస్” అని ఉమేష్ యాదవ్ పేర్కొన్నారు.
ఈ సీజన్లో గిల్, సాయి సుదర్శన్ ఇద్దరూ వ్యక్తిగతంగా 600 పరుగుల మార్కును దాటేశారు. పిచ్ను అంచనా వేస్తూ, బౌలర్ల వేగాన్ని ఉపయోగించుకుంటూ పరుగుల వరద పారించడంలో వీరిద్దరూ సిద్ధహస్తులు. మంగళవారం ఆర్సీబీతో జరగబోయే క్వాలిఫయర్ 1 మ్యాచ్లో ఈ జోడీ ప్రదర్శనపైనే గుజరాత్ టైటాన్స్ ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
