ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ (IPL) సందడి నెలకొంది. క్రికెట్ అభిమానులంతా తమ అభిమాన జట్లు సాధించే విజయాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అభిమానులు ‘సన్రైజర్స్ హైదరాబాద్’ (SRH) ఆటతీరుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, టోర్నీ మధ్యలో ఆటగాళ్లకు గాయాలు కావడం జట్లకు పెద్ద సవాలుగా మారుతుంది. ఇటీవల సన్రైజర్స్ జట్టులో కీలక బౌలర్ శివం మావి గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం కావడం అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేసింది. ఇలాంటి క్లిష్ట సమయంలో, సన్రైజర్స్ యాజమాన్యం జట్టును బలోపేతం చేసేందుకు ఒక యువ సంచలనాన్ని రంగంలోకి దించింది. అతడే అండర్-19 ప్రపంచకప్ స్టార్ ఆర్.ఎస్. అంబరీష్.
ఐపీఎల్ నిర్వాహకులు శుక్రవారం అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో శివం మావి స్థానాన్ని ఆర్.ఎస్. అంబరీష్ భర్తీ చేయనున్నారు. శివం మావికి గజ్జల్లో గాయం కావడంతో అతను మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదు. ఈ ఏడాది జరిగిన అండర్-19 ప్రపంచకప్లో అంబరీష్ అద్భుత ప్రదర్శన చేశాడు. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో మొత్తం 11 వికెట్లు పడగొట్టి, భారత జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు.
ఇతను కేవలం బౌలర్ మాత్రమే కాదు. కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలింగ్తో పాటు, ఎడమచేతి వాటంతో బ్యాటింగ్ చేయగల సమర్థుడు. ఈ ఆల్రౌండ్ ప్రతిభ జట్టుకు అదనపు బలం కానుంది. సన్రైజర్స్ యాజమాన్యం అంబరీష్ను రూ. 30 లక్షల బేస్ ప్రైస్తో జట్టులోకి తీసుకుంది. యువ రక్తం జట్టులో చేరడం వల్ల బౌలింగ్ విభాగం మరింత పటిష్టమవుతుందని భావిస్తున్నారు. ఈ యువ ఆటగాడు తన అంతర్జాతీయ అనుభవాన్ని ఐపీఎల్ వంటి పెద్ద వేదికపై ఎలా ప్రదర్శిస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శివం మావి అనుభవాన్ని జట్టు కోల్పోయినప్పటికీ.. అంబరీష్ వంటి ప్రతిభావంతుడైన కుర్రాడు రావడం సన్రైజర్స్కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఫ్యాన్స్ మాత్రం మరో కాటేరమ్మ కొడుకు జట్టులోకి వచ్చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
