ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గురువారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్తో చెలరేగిపోయాడు. మైదానంలో క్లాస్ షాట్లతో పాటు దూకుడును ప్రదర్శిస్తూ చెన్నై బౌలింగ్ లైన్ను పూర్తిగా దెబ్బతీశాడు. కేవలం 37 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేసి అదరగొట్టాడు. 172.97 స్ట్రైక్ రేట్తో సాగిన గిల్ ఇన్నింగ్స్, మరో ఓపెనర్ సాయి సుదర్శన్తో కలిసి గుజరాత్ జట్టుకు భారీ పునాది వేసింది. పవర్ప్లేలో చెన్నై లెఫ్ట్ ఆర్మ్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్ను టార్గెట్ చేసిన గిల్.. ఆఫ్సైడ్ వైపు వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 23 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివరకు 13వ ఓవర్లో స్పెన్సర్ జాన్సన్ వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరీని భారీ షాట్ ఆడబోయి మిడ్వికెట్లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. గిల్ అవుటయ్యే సమయానికి సాయి సుదర్శన్తో కలిసి మొదటి వికెట్కు అత్యంత కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ ద్వారా శుభ్మన్ గిల్ భారత టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో అతను 36 పరుగుల మార్కును దాటగానే, పురుషుల టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 6,000 పరుగులు పూర్తి చేసిన మూడో భారతీయ బ్యాటర్గా రికార్డు కెక్కాడు. గిల్ తన 185వ ఇన్నింగ్స్లో ఈ మైలురాయిని చేరుకోగా, అతనికంటే ముందు కేఎల్ రాహుల్ (166 ఇన్నింగ్స్లు), విరాట్ కోహ్లీ (184 ఇన్నింగ్స్లు) మాత్రమే ఈ జాబితాలో ముందున్నారు.
దీనితో పాటు.. ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్గా ఒకే సీజన్లో 600కు పైగా పరుగులు సాధించడం గిల్ కెరీర్లో ఇది రెండోసారి. ఇదివరకు 2025 సీజన్లోనూ అతను ఈ ఘనత సాధించాడు. ఈ అరుదైన మైలురాయిని ఒకటి కంటే ఎక్కువసార్లు అందుకున్న భారతీయ కెప్టెన్లుగా ఇప్పటివరకు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మాత్రమే ఉండగా, ఇప్పుడు గిల్ కూడా వారి సరసన నిలిచాడు. కేవలం పవర్పైనే కాకుండా టైమింగ్, ప్లేస్మెంట్పై ఆధారపడుతూ సాగిన గిల్ ఇన్నింగ్స్ అతని బ్యాటింగ్ పరిణితిని మరోసారి నిరూపించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకుంటున్న గుజరాత్ టైటాన్స్కు ఈ ఇన్నింగ్స్ ఎంతో ఊరటనివ్వగా, ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది.
