అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ (GT), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన టాటా ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపడమే కాకుండా ఒక వివాదానికి కూడా కేంద్రబిందువైంది. ఈ హై-వోల్టేజ్ పోరులో ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ మైదానంలో ప్రవర్తించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ అతనికి మ్యాచ్ ఫీజులో 50 శాతం భారీ జరిమానా విధించడమే కాకుండా, రెండు డీమెరిట్ పాయింట్లను కూడా కేటాయించారు.
ఈ వివాదాస్పద ఘటన మొదటి ఇన్నింగ్స్ 10వ ఓవర్ సమయంలో చోటుచేసుకుంది. ఒక వికెట్ పడిన తర్వాత తీవ్ర నిరాశకు లేదా అసహనానికి లోనైన టిమ్ డేవిడ్, మైదానంలో ఉన్న అంపైర్ నితిన్ మీనన్ వైపు కోపంతో ఐస్ బ్యాగ్ను విసిరాడు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లోని ఆర్టికల్ 2.9 ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్ళు, అంపైర్లు, మ్యాచ్ రెఫరీ లేదా ఏ ఇతర వ్యక్తి వైపునకైనా బంతిని లేదా వాటర్ బాటిల్స్, ఐస్ బ్యాగ్స్ వంటి క్రికెట్ పరికరాలను ప్రమాదకరమైన రీతిలో విసరడం తీవ్రమైన నేరం. డేవిడ్ చేసిన ఈ పని లెవెల్ 1 ఉల్లంఘన కిందికి వచ్చింది. మ్యాచ్ అనంతరం మ్యాచ్ రెఫరీ జవగల్ శ్రీనాథ్ విధించిన ఈ శిక్షను, తన తప్పును టిమ్ డేవిడ్ అంగీకరించాడు.
ఈ సీజన్లో టిమ్ డేవిడ్ క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడటం ఇది మూడోసారి కావడం గమనార్హం. గతంలో మ్యాచ్ 20లో మొదటిసారి నిబంధనలు ఉల్లంఘించి ఒక డీమెరిట్ పాయింట్, ఆ తర్వాత మ్యాచ్ 54లో రెండోసారి తప్పు చేసి మరో రెండు డీమెరిట్ పాయింట్లు లీగ్ దశలోనే మూటగట్టుకున్నాడు. తాజా ఫైనల్ మ్యాచ్తో కలిపి అతని ఖాతాలో మొత్తం ఐదు డీమెరిట్ పాయింట్లు చేరాయి. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఐదు డీమెరిట్ పాయింట్లు వస్తే ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడుతుంది. ఈ కారణంగా, ఐపీఎల్ 2027 తదుపరి సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడే మొదటి మ్యాచ్కైనా, లేదా అప్పటికి అతను ప్రాతినిధ్యం వహించే ఫ్రాంచైజీ తొలి మ్యాచ్కైనా టిమ్ డేవిడ్ దూరం కానున్నాడు. ఫైనల్ లాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్లో ఇలాంటి ప్రవర్తన ఆర్సీబీ అభిమానులను సైతం తీవ్ర నిరాశకు గురిచేసింది.
