Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే..! అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..

Pbks Captain Shreyas Iyer

Pbks Captain Shreyas Iyer

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసులో పంజాబ్ కింగ్స్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ జట్టు వరుసగా ఆరో పరాజయాన్ని చవిచూసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ 23 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆర్సీబీ బ్యాటర్లు వెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లీ అర్ధసెంచరీలతో రాణించగా, బౌలింగ్‌లో రసిఖ్ సలామ్ దార్ మూడు వికెట్లు తీసి పంజాబ్ పతనాన్ని శాసించాడు.

ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం 13 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ చేరాలంటే పంజాబ్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఖచ్చితంగా గెలవాలి. అయితే కేవలం గెలిస్తేనే సరిపోదు, ఇతర జట్ల ఫలితాలు, నెట్ రన్ రేట్ (NRR) పైనే వారి అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తమ మిగిలిన మ్యాచ్‌ల్లో ఒక్కటి మాత్రమే గెలిస్తే, అవి 15 పాయింట్ల కంటే తక్కువలోనే నిలిచిపోతాయి. ఒకవేళ సన్‌రైజర్స్ హైదరాబాద్ తన చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోతే 14 పాయింట్ల వద్దే ఆగిపోతుంది. అప్పుడు పంజాబ్ చివరి మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమవుతుంది. ఒకవేళ కేకేఆర్ రెండు మ్యాచ్‌లు గెలిచి, పంజాబ్ కూడా చివరి మ్యాచ్ గెలిస్తే ఇరు జట్లు 15 పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. అప్పుడు నెట్ రన్ రేట్ కీలకంగా మారుతుంది.

ఓటమిపై పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ప్రత్యర్థి జట్టు పవర్‌ప్లే తర్వాత వేగంగా ఆడి 222 పరుగులు చేసింది. మేము పవర్‌ప్లేలోనే వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకున్నాం. ప్రభ్‌సిమ్రాన్, ప్రియాంశ్ ఆర్య ఈ ఇద్దరూ ఇచ్చే మంచి ఆరంభాలు ఈసారి లభించలేదు. శశాంక్, స్టోయినిస్ బాగా పోరాడినప్పటికీ లక్ష్యానికి దూరంగా ఆగిపోయామని.. ఈ ఫలితం తాను ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఓటమి గురించే ఆలోచించనని.. తదుపరి లక్నో మ్యాచ్‌పై దృష్టి పెడతానని శ్రేయస్ చెప్పుకొచ్చాడు.