ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టుకైనా ఎదురుకాకూడని ఒకే ఒక్క రికార్డు ’49 పరుగులు’. 2017లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR)పై ఆర్సీబీ చేసిన ఈ అతి తక్కువ స్కోరు ఒక పీడకలలా ఆ జట్టును వెంటాడుతూనే ఉంది. అయితే.. నేడు ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఈ చెత్త రికార్డు ఆర్సీబీ నుంచి వేరే జట్టుకు బదిలీ అవుతుందని అందరూ ఊహించారు.
“హమ్మయ్య.. 49 దాటేశాం!”
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆర్సీబీ బౌలర్లు నిప్పులు చెరిగారు. పవర్ ప్లే ముగిసేలోపే 6 వికెట్లు పడగొట్టి ఢిల్లీని కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఒక దశలో ఢిల్లీ స్కోరు చూసి, కచ్చితంగా ఆ జట్టు 49 పరుగుల లోపే ఆలౌట్ అవుతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా “మాపై ఉన్న చెత్త రికార్డు ఇవాళ్టితో తుడిచిపెట్టుకుపోతుంది” అని ఆశగా ఎదురుచూశారు. కానీ, డేవిడ్ మిల్లర్ మరియు అభిషేక్ పోరెల్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. జట్టు స్కోరును 50 దాటించడంతో ఢిల్లీ అభిమానులు సోషల్ మీడియాలో “హమ్మయ్య.. 49 దాటేశాం” అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు.
మిల్లర్, పోరెల్ పోరాటం
టాప్ ఆర్డర్ అంతా ఒక్క అంకెకే పరిమితమైన వేళ.. అభిషేక్ పోరెల్ (21 బంతుల్లో 19), డేవిడ్ మిల్లర్ (18 బంతుల్లో 19) జాగ్రత్తగా ఆడి స్కోరు బోర్డును ముందుకు నడిపారు. వీరిద్దరి వల్ల ఢిల్లీ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు చేసే ప్రమాదం నుంచి బయటపడింది. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 7 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది.
ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ..
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. “రికార్డు బదిలీ అయ్యే ఛాన్స్ మిస్ అయింది” అని కొందరు ఆర్సీబీ ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ పెడుతుంటే.. “వికెట్లు పడినా పర్లేదు గానీ ఆ 49 రికార్డు మాత్రం మాకొద్దు” అని ఢిల్లీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి ఢిల్లీ జట్టు ఆలౌట్ ప్రమాదం నుంచి బయటపడకపోయినా, అత్యల్ప స్కోరు అనే అవమానం నుంచి మాత్రం ప్రస్తుతానికి తప్పించుకుంది.
ఆర్సీబీ బౌలర్ల ధాటికి ఢిల్లీ బెంబేలెత్తిపోయినా, మిడిల్ ఆర్డర్ పోరాటంతో పరువు దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే.. బౌలింగ్లో ఆర్సీబీ చూపించిన ఆధిపత్యం చూస్తుంటే, ఈ మ్యాచ్లో విజయం వారిని వరించడం ఖాయంగా కనిపిస్తోంది.
