చెపాక్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు సమిష్టిగా రాణించి కోల్కతా నైట్ రైడర్స్ ముందు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు సాధించింది. గత మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన సంజు శాంసన్, ఈ మ్యాచ్లో కూడా తన ఫామ్ను కొనసాగిస్తూ కీలకమైన 48 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో ముఖ్య భూమిక పోషించారు. ఆయనకు తోడుగా యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ (41 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి స్కోరు బోర్డును పరుగెత్తించాడు.
మరోవైపు ఓపెనర్ ఆయుష్ మ్హత్రే (38 పరుగులు) జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వగా, మధ్యలో సర్ఫరాజ్ ఖాన్ (23 పరుగులు) వేగంగా ఆడి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. టాప్ ఆర్డర్ అంతా బాధ్యతాయుతంగా ఆడటంతో చెన్నై జట్టు ఎక్కడా తడబడకుండా గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై ఉంచగలిగింది.
కేకేఆర్ టార్గెట్ 193..
కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ , వరుణ్ చక్రవర్తీ పరుగులను కట్టడి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, సీఎస్కే బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. కీలక సమయాల్లో వికెట్లు తీయడంలో కేకేఆర్ బౌలర్లు కాస్త వెనుకబడ్డారు.
ఇప్పుడు 193 పరుగుల లక్ష్యంతో కేకేఆర్ బ్యాటింగ్ ప్రారంభించనుంది. చెపాక్ పిచ్ రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో, ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించడం అజింక్యా రహానే సేనకు అగ్నిపరీక్షే అని చెప్పాలి. వరుస ఓటములతో సతమతమవుతున్న కేకేఆర్, ఈ కొండంత లక్ష్యాన్ని ఎలా అధిగమిస్తుందో చూడాలి. ఒకవేళ కేకేఆర్ ఈ మ్యాచ్లో ఓడిపోతే వారి ప్లేఆఫ్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారతాయి. సీఎస్కే మాత్రం తమ సొంత మైదానంలో రెండో విజయాన్ని నమోదు చేయాలని పట్టుదలగా ఉంది.
