టీమ్ ఇండియా బౌలర్, పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్దీప్ సింగ్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్కు ముందు ఈ సంఘటన చోటుచేసుకుంది.
వైరల్ వీడియో ప్రకారం.. అర్ష్దీప్ సింగ్ ముంబై ఆటగాడు నమన్ ధీర్తో కలిసి కూర్చుని ఉన్న సమయంలో, అక్కడి నుంచి వెళ్తున్న తిలక్ వర్మను ఉద్దేశించి “ఓయ్ అంధేరే” (చీకటి లాంటి వాడా) అని పిలిచారు. అంతటితో ఆగకుండా కెమెరాను నమన్ ధీర్ వైపు తిప్పి, “ఇతను పంజాబ్ అసలైన వెలుగు (నూర్).. నీ ముఖం ఒకసారి చూసుకో” అంటూ తిలక్ వర్మ చర్మ రంగును ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు అర్ష్దీప్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. స్నేహితుల మధ్య సరదా సంభాషణ అయినప్పటికీ, ఒకరి చర్మ రంగును గేలి చేయడం ‘వర్ణ వివక్ష’ (Racism) కిందికే వస్తుందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్ష్దీప్ సింగ్ ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆయన పోస్ట్ చేసిన ఒక వ్లాగ్లో టీమ్ ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ విమానంలో ‘వేప్’ (Vape) ఉపయోగిస్తూ కనిపించడం పెద్ద వివాదానికి దారి తీసింది. ఇప్పుడు మరోసారి తోటి ఆటగాడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ వివాదంపై అటు ఆటగాళ్ల నుంచి కానీ, ఇటు ఐపీఎల్ యాజమాన్యం నుంచి కానీ ఇంకా ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.
