లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 2026 ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించినప్పటికీ, సీజన్ చివరి మ్యాచ్లో అభిమానులకు ఒక ప్రత్యేక క్షణాన్ని అందించింది. సచిన్ టెండూల్కర్ కుమారుడు, ఎడమచేతి ఫాస్ట్ బౌలర్ అర్జున్ టెండూల్కర్ కు ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడే అవకాశం కల్పించింది. సీజన్ మొత్తం బెంచ్కే పరిమితమైన అర్జున్, ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని తన ప్రదర్శనతో అందరి ప్రశంసలు అందుకున్నాడు.
అర్జున్పై సచిన్ ఎమోషనల్ మెసేజ్
మ్యాచ్ అనంతరం సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో తన కుమారుడి కోసం భావోద్వేగ సందేశం పంచుకున్నారు. అర్జున్ ఫోటోను షేర్ చేస్తూ, “ఈ సీజన్ మొత్తం నువ్వు ప్రదర్శించిన ఓర్పు, నిశ్శబ్ద కృషి, నీ సామర్థ్యాలపై నమ్మకం చూసి చాలా గర్వంగా ఉంది” అని పేర్కొన్నారు. అంతేకాకుండా, “క్రికెట్ కేవలం నైపుణ్యాన్ని మాత్రమే కాదు, సహనాన్ని కూడా పరీక్షిస్తుంది. ఈ మ్యాచ్లో నువ్వు రెండింటినీ అద్భుతంగా నిరూపించావు. ఎప్పటిలాగే వినయంగా ఉండు.. ఆటను ప్రేమిస్తూనే ఉండు” అంటూ అర్జున్ను ప్రోత్సహించారు.
బ్యాటింగ్, బౌలింగ్లో మెరిసిన అర్జున్
పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో అర్జున్ టెండూల్కర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మొదట బ్యాటింగ్లో చివర్లో క్రీజులోకి వచ్చిన అర్జున్, 5 బంతుల్లో 5 పరుగులు చేసి జట్టు స్కోరును 196/6కి చేర్చడంలో సహాయపడ్డాడు. తర్వాత బౌలింగ్లో కూడా ఆకట్టుకున్నాడు. పవర్ప్లే ముగిసిన వెంటనే కెప్టెన్ రిషబ్ పంత్ అతనికి బంతిని అందించాడు. తన వేగవంతమైన బౌన్సర్తో పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ను ఇబ్బంది పెట్టిన అర్జున్కు మొదట వికెట్ దక్కలేదు. వికెట్ల వెనుక రిషబ్ పంత్ క్యాచ్ను చేజార్చాడు. అయితే, ఆ తర్వాత అర్జున్ అద్భుతంగా పునరాగమనం చేసి, కచ్చితమైన యార్కర్తో ప్రభ్సిమ్రన్ సింగ్ను ఔట్ చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్లో అతనికి ఇదే తొలి వికెట్ కావడం విశేషం.
లక్నో తరఫున అత్యంత పొదుపైన బౌలర్
197 పరుగుల భారీ లక్ష్య ఛేదన జరిగిన ఈ హైస్కోరింగ్ మ్యాచ్లో, అర్జున్ టెండూల్కర్ అత్యంత క్రమశిక్షణతో బౌలింగ్ చేశాడు. తన నాలుగు ఓవర్లలో కేవలం 36 పరుగులిచ్చి ఒక వికెట్ తీసి, లక్నో తరఫున అత్యంత పొదుపైన బౌలర్గా నిలిచాడు.
మరోవైపు, Shreyas Iyer అద్భుత సెంచరీతో పంజాబ్ కింగ్స్కు 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. అయినప్పటికీ, అర్జున్ టెండూల్కర్ చూపించిన ఆత్మవిశ్వాసం, నియంత్రణ, సహనం అతడిని రాబోయే సీజన్లకు బలమైన పోటీదారుడిగా నిలబెట్టాయి.
