MS Dhoni CSK Stake: మిస్టర్ కూల్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు గుడ్బై చెప్పినా.. ఐపీఎల్లో కొనసాగుతున్నారు.. అయితే, ఐపీఎల్ 2026లో ఒక్క మ్యాచ్ కూడా ఆడింది లేదు.. అయితే, ధోనీ అంటే చెన్నై సూపర్ కింగ్స్.. CSK అంటే ఎంఎస్ ధోనీ.. అన్నట్టుగా.. ధోనీ ఫ్యాన్స్ మొత్తం.. సీఎస్కే ఫ్యాన్సే అనేదాంట్లో అతిశయోక్తి మాత్రం ఏ మాత్రం లేదు.. ధోనీ వల్లే.. ఆ జట్టుకు అంత ఫేమ్ వచ్చింది.. అయితే, ఎంఎస్ ధోనీ.. CSK జట్టులో 25 శాతం వాటా కోరారని, ఆ తర్వాత దాన్ని 20 శాతానికి తగ్గించారని ఇటీవల ఓ వార్త ప్రచారం జరిగింది. అనంతరం ధోనీకి ఫ్రాంచైజీ 5.5 శాతం వాటా ఆఫర్ చేసిందనే ప్రచారం కూడా సాగింది. తాజాగా ఈ వ్యవహారంపై సీఎస్కే స్పందిస్తూ.. క్లారిటీ ఇచ్చింది..
ధోనీ వాటాపై మౌనం వీడిన సీఎస్కే..
సీఎస్కేకు చెందిన ఓ సీనియర్ అధికారి ఈ వార్తలను ఖండించారు. ధోనీ ఎప్పుడూ వాటా గురించి తమను సంప్రదించలేదని, ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్తో ధోనీ ఈ విషయంపై మాట్లాడినట్లు కూడా తమకు సమాచారం లేదని పేర్కొన్నారు. ధోనీ ప్రస్తుతం కూడా సీఎస్కేతో కొనసాగుతున్నారు. కెప్టెన్గా జట్టును ఐదు ఐపీఎల్ టైటిళ్లకు నడిపించిన ఆయన.. ఫ్రాంచైజీతో ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు.
సీఎస్కేలో ధోనీకి ఇప్పటికే షేర్లు..?
ధోనీకి సీఎస్కే ఫ్రాంచైజీలో కొన్ని షేర్లు ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. సీఎస్కే స్టాక్ మార్కెట్లో లిస్టైన సంస్థ కాకపోవడంతో, దాని షేర్లను ప్రైవేట్గా ఆఫ్-మార్కెట్ లావాదేవీల ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉందని సమాచారం. ధోనీ వద్ద లక్షకు పైగా షేర్లు ఉన్నట్లు కూడా ఆ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఫ్రాంచైజీలో 30 కోట్లకు పైగా షేర్లు ప్రజల వద్ద ఉండగా, అవి మొత్తం షేర్ క్యాపిటల్లో దాదాపు 40 శాతంగా ఉన్నట్లు సమాచారం. ఎన్. శ్రీనివాసన్ కుటుంబం 55 శాతానికి పైగా వాటాతో నియంత్రణ హక్కులు కలిగి ఉంది.
ధోనీ వాటా విలువ ఎంత?
ప్రస్తుత ఐపీఎల్ ఫ్రాంచైజీల మార్కెట్ విలువ ఆధారంగా ధోనీకి ఉన్న వాటా విలువ సుమారు రూ.2.6 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఉండొచ్చని అంచనాలు వెలువడ్డాయి. ధోనీ మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.1,200 కోట్లుగా ఉంటుందని అంచనా.
ధోనీ 25 శాతం వాటా అడిగారన్న ప్రచారంపై ఆకాష్ చోప్రా
మాజీ భారత క్రికెటర్ ఆకాష్ చోప్రా కూడా ధోనీ 25 శాతం వాటా కోరారన్న ప్రచారంపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ కథనం వాస్తవంగా కనిపించడం లేదని, బహుశా ప్రచారం కోసం సృష్టించిన కథనం కావచ్చని వ్యాఖ్యానించారు. ఆర్సీబీ ఇటీవల సుమారు 1.7 నుంచి 1.8 బిలియన్ డాలర్ల విలువకు విక్రయించబడిన విషయాన్ని ప్రస్తావించిన చోప్రా.. ఐదు ఐపీఎల్ టైటిళ్లు, భారీ బ్రాండ్ విలువ, అంతర్జాతీయ స్థాయిలో ఫ్రాంచైజీలను కలిగి ఉన్న సీఎస్కే విలువ కూడా భారీగా ఉంటుందని అన్నారు. అలాంటి ఫ్రాంచైజీలో 25 శాతం వాటా అంటే వందల మిలియన్ డాలర్ల విలువ ఉంటుందని, అంత పెద్ద వాటాను ఎవరైనా ఉచితంగా ఇవ్వడం అసాధ్యమని చోప్రా అభిప్రాయపడ్డారు. సీఎస్కే వంటి ఐపీఎల్ జట్టులో 25 శాతం వాటా పొందాలంటే అంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

