NTV Telugu Site icon

Chennai Super Kings: అదే మా ఓటమిని శాసించింది: రుతురాజ్ గైక్వాడ్

Ruturaj Gaikwad

Ruturaj Gaikwad

బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి కారణం అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. తమ బ్యాటింగ్ సమయంలో పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉందని, 50-60 పరుగులు తక్కువగా చేశాం అన్నాడు. టాస్ ఓడిపోవడం కూడా తమ ఓటమిని శాసించిందని రుతురాజ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ… ‘మేం 50-60 పరుగులు తక్కువ చేశాం. మేం బ్యాటింగ్ చేసిన్నపుడు పిచ్ బాగా లేదు. బ్యాటింగ్‌కు చాలా కష్టమైంది. టాస్ ఓడిపోవడం కూడా మా ఓటమిని శాసించింది. ఇంపాక్ట్ రూల్‌ బాగుంది. కానీ మేం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం. ప్రాక్టీస్ సెషన్‌ల సమయంలో టాస్ గెలవడంపై తీవ్ర కసరత్తులు చేశాను. కానీ ఫలితం మాత్రం అనుకూలంగా రావడంలేదు. టాస్ విషయంలో నేను తీవ్ర ఒత్తిడికి గురవుతున్నా. ఏం చేయాలో తెలియడం లేదు’ అని అన్నాడు.

Also Read: Gangs Of Goadavari : విశ్వక్ మూవీకి భారీ ధరకు ఓటీటీ డీల్..?

‘తేమ ఉన్న మైదానంలో లక్ష్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. గత మ్యాచ్‌లో పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. మేం భారీ స్కోర్ సాధించాం. అంతేకాదు భారీ తేడాతో విజయం సాధించాం. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మేం మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. గత రెండు మ్యాచ్‌ల్లో మేం 200-210 పరుగులు చేశాం. కానీ ఈ పిచ్ చాలా కఠినంగా ఉంది. 180 పరుగులు కూడా చేయలేకపోయాం. మహీశ పతీరణ, తుషార్ దేశ్‌పాండే గైర్హాజరీ కూడా మాకు సమస్యగా మారింది. మాకు ఇంకా నాలుగు గేమ్‌లు మిగిలి ఉన్నాయి. తిరిగి విజయాల బాట పడుతాం’ అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పాడు.