Sunil Gavaskar: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)ను సూటిగా ప్రశ్నించారు టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. భారత క్రికెటర్లపై పెరుగుతున్న మ్యాచ్ల భారం, బిజీ షెడ్యూల్పై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. 2027 నుంచి ప్రారంభం కానున్న కొత్త నాలుగేళ్ల అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ను రూపొందించేటప్పుడు ఆటగాళ్ల పనిభారం, శారీరక పరిమితులను పరిగణనలోకి తీసుకోవాలని ఐసీసీని కోరారు. భారత క్రికెటర్లు యంత్రాలు కాదని, చివరి చుక్క రసం వచ్చే వరకు పిండే చెరకు కూడా కాదని వ్యాఖ్యానించారు.
స్పోర్ట్స్టార్లో రాసిన తన కాలమ్లో గవాస్కర్ భారత క్రికెట్లో పెరుగుతున్న బిజీ షెడ్యూల్ను ప్రశ్నించారు గవాస్కర్.. ఒక సిరీస్ ముగిసిన వెంటనే మరో సిరీస్, టోర్నమెంట్కు ఆటగాళ్లను పంపడం వల్ల వారికి తగినంత విశ్రాంతి దొరకడం లేదని అన్నారు. నిరంతరం క్రికెట్ ఆడటం వల్ల ఆటగాళ్ల ఫిట్నెస్తో పాటు వారి ప్రదర్శనపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారత క్రికెట్లో గాయాలు పెరగడానికి మ్యాచ్ల సంఖ్య కూడా ఒక కారణమని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా పేర్కొన్న నేపథ్యంలో గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నాల్లో బీసీసీఐ కూడా ఉందని తెలుస్తోంది. 2027 నుంచి అమల్లోకి రానున్న నాలుగేళ్ల క్రికెట్ క్యాలెండర్పై ఐసీసీ చర్చించనున్న నేపథ్యంలో గవాస్కర్ సూచనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
‘టీమ్ ఇండియా అంటే మొత్తం భారత క్రికెట్ కాదు’
ఆటగాళ్ల పనిభారంతో పాటు భారత క్రికెట్ వ్యవస్థపై కూడా గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత క్రికెట్లో ‘టీమ్ ఇండియా’పై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారని, అయితే జాతీయ జట్టు మొత్తం భారత క్రికెట్ కాదని అన్నారు. భారత క్రికెట్ జట్టు అనేది భారత క్రికెట్కు ఒక ఉప ఉత్పత్తి మాత్రమే అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకేసారి మూడు అంతర్జాతీయ జట్లను బరిలోకి దించేంత బలమైన రిజర్వ్ బెంచ్ భారత్కు ఉందన్న వాదనను కూడా గవాస్కర్ ప్రశ్నించారు. కాగితంపై మూడు జట్లను తయారు చేయగల సామర్థ్యం ఉన్నంత మాత్రాన, దేశీయ క్రికెట్ నుంచి నిరంతరం ప్రపంచ స్థాయి ఆటగాళ్లు వస్తారనే హామీ లేదని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఫలితాలను పరిశీలిస్తే ఒక్క భారత జట్టుకైనా అనేక ట్రోఫీలు గెలిచే స్థిరమైన ఆధిపత్యం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.
దేశీయ క్రికెట్పైనే అసలు దృష్టి పెట్టాలి
భారత క్రికెట్ భవిష్యత్తుకు దేశీయ క్రికెట్ వ్యవస్థ కీలకమని గవాస్కర్ స్పష్టం చేశారు. దేశీయ క్రికెట్ను బలోపేతం చేయకపోతే భవిష్యత్తులో ప్రపంచ స్థాయి ఆటగాళ్లను తయారు చేయడం కష్టమవుతుందని పేర్కొన్నారు. దేశీయ స్థాయిలో బలమైన వ్యవస్థ ఉంటేనే అంతర్జాతీయ క్రికెట్కు నాణ్యమైన ఆటగాళ్లు అందుబాటులో ఉంటారని అన్నారు. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించడం భారత జట్టుకు పునరుత్తేజాన్ని అందించి, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అయితే దీర్ఘకాలికంగా ప్రపంచ విజేతలను తయారు చేయాలంటే దేశీయ క్రికెట్కు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తంగా గవాస్కర్ సందేశం ‘తక్కువ క్రికెట్ ఆడాలి’ అనే దానికే పరిమితం కాదు. ఆటగాళ్లకు తగిన విశ్రాంతి లభించేలా, దేశీయ క్రికెట్కు తగిన స్థానం కల్పించేలా, టీమ్ ఇండియా విజయాల వెనుక ఉన్న మొత్తం క్రికెట్ వ్యవస్థను బలోపేతం చేసేలా భవిష్యత్ క్యాలెండర్ ఉండాలని సూచించారు సునీల్ గవాస్కర్…

