ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ సత్తా చాటింది. ఇంగ్లండ్పై ఏడు వికెట్లతేడాతో విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈపోరులో భారత్ పై చేయి సాధించింది.ప్రధానంగా భారత బ్యాట్స్మన్ ధాటిగా ఆడడంతో ఒక్క ఓవర్ మిగిలి ఉండగానే విజయభేరీ మోగించింది భారత్.టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్లో భారత్ అదరగొట్టింది. తొలి వార్మప్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై విజయభేరి మోగించింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన ఇషాన్ కిషన్,కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలతో దుమ్మురేపారు.
తొలి వికెట్కు వీరిద్దరు కలిసి 8.2 ఓవర్లలో 82 పరుగుల భాగస్వామ్యం అందించి మంచి పునాది వేశారు. మంచి ఊపుమీదున్న రాహుల్… మార్క్వుడ్ బౌలింగ్లో ఔటయ్యాడు. అనంతరం వచ్చిన కోహ్లీ 11 పరుగులే చేసి లివింగ్ స్టోన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. మరోవైపు ధాటిగా ఆడుతున్న ఇషాన్ కిషన్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్తో జట్టుకట్టిన రిషబ్ పంత్ నెమ్మదిగా పరుగుల వేగాన్ని పెంచాడు. చివరి రెండు ఓవర్లలో 20 పరుగులు అవసరం కాగా, ఒక్క ఓవర్లలోనే భారత్ 20 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యతో కలిసి రిషబ్పంత్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లో జానీ బెయిర్ స్టో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆఖర్లో వచ్చిన మొయిన్ అలీ ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో మహమ్మద్ షమి మూడు, రాహుల్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా తలో వికెట్ తీశారు.
