NTV Telugu Site icon

Common Wealth Games 2022: కామన్‌వెల్త్‌లో దూసుకెళ్తున్న భారత్.. 20 పతకాలు కైవసం

India At Common Wealth Games

India At Common Wealth Games

Common Wealth Games 2022: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఈ క్రీడల్లో ఇప్పటికే (ఆరో రోజు) భారత్‌ 20 పతకాలు (6 స్వర్ణాలు, 7 రజతాలు, 7 కాంస్యాలు) సాధించింది. ప్రస్తుతం జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్‌కు చెందిన మురళీ శ్రీశంకర్ పురుషుల లాంగ్ జంప్ ఫైనల్‌లో 8.08 మీటర్ల మార్కుతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పురుషుల లాంగ్ జంప్‌లో శ్రీశంకర్ 8.08 మీటర్ల దూరంతో చారిత్రాత్మక రజతం గెలుచుకున్నాడు, లాంగ్‌జంప్‌లో కామన్వెల్త్ గేమ్స్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ పురుష అథ్లెట్‌గా నిలిచాడు.పారా-పవర్‌లిఫ్టర్ సుధీర్ కామన్వెల్త్ గేమ్స్‌లో పారా-పవర్‌లిఫ్టింగ్‌లో భారతదేశానికి మొదటి స్వర్ణం సాధించాడు. అతను నైజీరియాకు చెందిన ఇకెచుక్వు ఒబిచుక్వు (133.6 పాయింట్లు)ని 0.9 పాయింట్ల తేడాతో ఓడించాడు, అతని చివరి స్కోరు గోల్డ్ మెడల్ కోసం 134.5 పాయింట్ల రికార్డును సృష్టించాడు.

కామన్వెల్త్‌ యూత్‌ గేమ్స్‌తో వెలుగులోకి వచ్చిన హైజంపర్‌ తేజస్విన్‌ శంకర్‌ ఇప్పుడు..యువ అథ్లెట్‌ తేజస్విన్‌ శంకర్‌ సీనియర్‌ క్రీడల్లో పతకం గెలుచుకునే స్థాయికి ఎదిగి చరిత్ర సృష్టించాడు.. కామన్వెల్త్‌ క్రీడల హైజంప్‌లో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా రికార్డు పుటలకెక్కాడు..కోర్టు జోక్యంతో ఈ గేమ్స్‌ బరిలోకి దిగిన 23 ఏళ్ల ఢిల్లీ అథ్లెట్‌ కాంస్య పతకంతో తన సత్తా నిరూపించుకున్నాడు. ఇక, బాక్సర్లు జాస్మిన్‌, అమిత్‌ పంగల్‌, సాగర్‌ సెమీస్‌కు చేరడం ద్వారా మరో మూడు పతకాలు ఖాయం చేశారు..అయితే టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గొహైన్‌ క్వార్టర్‌ఫైనల్లో పరాజయం చవిచూసింది. మహిళల హ్యామర్‌త్రోలో మంజూబాల ఫైనల్‌కు చేరింది.. పురుషుల హాకీ జట్టు సెమీస్‌లో ప్రవేశించింది.

వెయిట్‌ లిఫ్టింగ్‌ హెవీ వెయిట్‌ విభాగంలో భారత్‌కు తొలి పతకం దక్కింది. ప్లస్‌ 109 కేజీల ఈవెంట్‌లో గుర్దీప్‌ సింగ్‌ కాంస్యం గెలుచుకున్నాడు. బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పోటీల్లో గుర్దీప్‌ 390 కేజీల బరువెత్తి కంచు మోత మోగించాడు. స్నాచ్‌లో 167 కేజీలెత్తిన గుర్దీప్‌.. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 223 కేజీలు ఎత్తాడు. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన గుర్దీప్‌.. ఈక్రమంలో జాతీయ రికార్డును తిరగరాశాడు. మణికట్టు గాయం వల్ల స్నాచ్‌లో వంద శాతం ప్రదర్శన కనబర్చలేకపోయానని..లేకపోతే దేశానికి కనీసం రజతం అందించేవాడినని పోటీ అనంతరం గుర్దీప్‌ అన్నాడు. ఈ విభాగంలో పాకిస్థాన్‌కు చెందిన మహమ్మద్‌ నూహ్‌ భట్‌ 405 కేజీలు (173+232) స్వర్ణం చేజిక్కించుకోగా.. న్యూజిలాండ్‌ లిఫ్టర్‌ డేవిడ్‌ ఆండ్రూ 394 (170+224) రజతం నెగ్గాడు. భారత అభిమానుల నుంచి తనకు విశేష మద్దతు లభించిందని నూహ్‌ భట్‌ పేర్కొన్నాడు. ఒలింపిక్‌ రజత పతక విజేత మీరాబాయి చాను తన రోల్‌ మోడల్‌ అని తెలిపాడు.

Commonwealth Games: హైజంప్‌లో భారత్‌కు పతకం.. తొలి అథ్లెట్‌గా తేజస్విన్ రికార్డు

బాక్సింగ్‌లో మరో అరడజను పతకాలు కూడా ఖాయమైనట్లు తెలుస్తోంది. బాక్సర్లు అమిత్ పంఘల్, జైస్మిన్ లంబోరియా, సాగర్, రోహిత్ టోకాస్ తమ తమ సెమీ-ఫైనల్‌కు చేరుకున్నారు.తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వేల్స్‌ను ఓడించి భారత పురుషుల హాకీ జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఏస్ స్ప్రింటర్ హిమా దాస్ మహిళల 200 మీటర్ల సెమీస్‌కు అర్హత సాధించింది. బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవి సింధు, కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ తమ మొదటి సింగిల్స్ మ్యాచ్‌లలో ముందంజ వేశారు. డిఫెండింగ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ మనిక బాత్రా కూడా ముందుకు సాగగా, సత్యన్ జ్ఞానశేఖరన్, ఏస్ పాడ్లర్ శరత్ కమల్ తమ డబుల్స్ మ్యాచ్‌లలో తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. భారతదేశానికి చెందిన అనుభవజ్ఞురాలైన స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ మొదటిసారిగా మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లలో విజేతగా నిలిచింది.