Origin of Telangana: ప్రత్యేక రాష్ట్రం కొరకు దశాబ్దాలుగా జరిగిన ఉద్యమాలు ఫలించి, 2014 జూన్ 2 నాడు కొత్త రాష్ట్రంగా అవతరించింది. అయితే ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో మీలో ఎంత మందికి తెలుసు. నిజానికి ఒక ప్రాంతం యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రకు సజీవ సాక్ష్యాలు శాసనాలు. గతంలో పాలించిన రాజులు, సామంతులు వేయించిన శాసనాల ఆధారంగానే ఎన్నో చారిత్రక సత్యాలు వెలుగులోకి వస్తుంటాయి. సరిగ్గా ఇదే క్రమంలో ‘తెలంగాణ’ అనే పదం ఎలా పుట్టింది? దానికి ఉన్న ప్రాచీన ఆధారాలు ఏంటి? అనే విషయంలో చరిత్రకారుల మధ్య ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు మనకు అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం ‘తెలుంగణపురం’ అని లిఖించి ఉన్న తెల్లాపూర్ శాసనమే మొదటిదా? లేక అంతకంటే ముందే తెలంగాణ అనే పేరుకు ఇతర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అనే దానిపై ఈ స్పెషల్ స్టోరీలో పూర్తి వివరాలను తెలుసుకుందాం.
తెల్లాపూర్ శాసనం ఏం చెబుతోందంటే..
హైదరాబాద్కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెల్లాపూర్ గ్రామం మధ్యలో ఒక చారిత్రక శాసనం కనిపిస్తుంది. 24 లైన్లతో ఉన్న ఈ శాసనాన్ని క్రీ.శ.1418 సంవత్సరం జనవరి 8న వేయించినట్లు అందులో స్పష్టంగా ఉంది. ఫిరోజ్ షా కాలానికి చెందిన ఈ శాసనంలో 13వ లైనులో ‘తెలుంగణపురం’ అనే పదం ఉంది. విశ్వకర్మ వంశస్థులైన నాగోజు, అయ్యలోజు, వల్లభోజులు ఈ శాసనాన్ని వేయించారు. ఫిరోజ్ షా భార్యకు బంగారు గాజుండల గొలుసును కానుకగా ఇచ్చిన సందర్భాన్ని ఇది వివరిస్తుంది. అప్పట్లో ఈ గ్రామాన్ని ‘తెలుంగాణపురం’ అని పిలిచేవారని, కాలక్రమంలో అదే ‘తెల్లాపూర్’గా మారి ఉంటుందని చరిత్రకారులు అంటారు.
తెల్లాపూర్ కంటే 60 ఏళ్ల ముందే శ్రీరంగం తామ్రపత్రం
అయితే తెల్లాపూర్ శాసనం కంటే ముందుగానే శ్రీరంగంలో లభించిన తామ్రపత్రంలో తెలంగాణ పదాల ప్రస్తావన ఉందని ‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. తెల్లాపూర్ శాసనం కంటే 60 ఏళ్లకు ముందే, అంటే క్రీ.శ. 1358లోనే శ్రీరంగంలోని రంగనాయకుల ఆలయంలో లభించిన తామ్రపత్రంలో తెలంగాణ ప్రస్తావన ఉంది. ముసునూరి నాయకుడైన కాపయ నాయకుడి అల్లుడు ముప్ప నాయకుడు ఈ తామ్రపత్రాన్ని రాయించారు. ఆరు రాగి రేకులపై ఉన్న ఈ శాసనంలో మొదటి రేకుపై ‘తిలింగణామా, తిలింగాణా’ అనే పదాలు ఉన్నాయి. ‘తిలింగ’ అంటే తెలుగు, ‘ఆణెము’ అంటే దేశము లేదా ప్రాంతం అని అర్థం. ఈ రెండు కలిసి ‘తిలింగాణ’గా, ఆ తర్వాత వాడుక భాషలో ‘తెలంగాణ’గా మారిందని హరగోపాల్ వివరించారు. ఒకప్పుడు కాకతీయ సామ్రాజ్యంలో శ్రీరంగం అంతర్భాగంగా ఉండటం వల్ల అక్కడ ఈ దేశం సరిహద్దులను సూచిస్తూ ఈ పదాన్ని వాడారు. సంగంభట్ల నర్సయ్య గారి విశ్లేషణ ప్రకారం.. “గోదావరి నదికి ఉన్న ప్రాచీన పేరు ‘తెలివాహ’. తెలివాహ నది ఒడ్డున మొదలైన జాతి, తడిచిన నేల (మాగాణం) కాబట్టి.. ‘తెలి + మాగాణం’ కలిసి ‘తెలింగాణ’గా రూపాంతరం చెందింది” అని ఆయన వెల్లడించారు.
గోదావరి నది ‘తెలివాహ’ పేరు నుంచేనా
ప్రముఖ చరిత్రకారుడు, తెలుగు పండితుడు సంగంభట్ల నర్సయ్య రాసిన ‘తెలివాహ గోదావరి’ పుస్తకంలో తెలంగాణ పదం పుట్టుకకు భౌగోళిక, సాంస్కృతిక కారణాలను విశ్లేషించారు. క్రీస్తు శకం ఒకటో శతాబ్దంలోనే దీనికి బీజం పడిందని ఆయన పేర్కొన్నారు. తెలివాహ (గోదావరి) నదితో తడిసిన నేల (మాగాణి) కావడం వల్ల ‘తెలి’, ‘మాగాణం’ అనే రెండు పదాలు కలిసి ‘తెలింగాణ’గా మారింది. భాషా శాస్త్రం ప్రకారం రెండు పదాలు కలిసినప్పుడు ‘మ’కారం సున్నాగా మారుతుంది. ఈ ప్రాంతంలో మాట్లాడే భాష కాబట్టే దీనికి ‘తెలుంగు’ లేదా ‘తెలుగు’ అనే పేరు వచ్చిందని ఆయన తెలిపారు.
సాహిత్యంలో, నాణేలపై తెలంగాణ ఆనవాళ్లు..
మరో చరిత్రకారుడు డి.సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. సాహిత్యంలోనూ, ముస్లిం పాలకుల కాలంలోనూ తెలంగాణను పోలిన పదాలు కనిపిస్తున్నాయి. కేతన రాసిన దశకుమార చరిత్ర (11వ శతాబ్దం) గ్రంథంలో ‘తెలుంగరాయ’ (తెలుగు రాజు) అనే పదం వాడారు. గియాసుద్దీన్ తుగ్లక్ కాలంలో విడుదల చేసిన తుగ్లక్ నాణేలపై (1323) ‘తెలింగాణ’ అనే పదం ముద్రించి ఉంది. చరిత్రలో షోడశ మహాజనపదాలలో ఒకటైన అశ్మక జనపదం విలసిల్లిన ప్రాంతం తెలంగాణ ప్రాంతం. రామాయణ – మహాభారత కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్లు ఈ నేలలో దొరికాయి. కాకతీయుల కాలంలో ఈ ప్రాంతం ఎంతో వైభవంగా వెలుగొందింది. తెలుగులో తొలి రామాయణ కర్త బమ్మెర పోతన, దక్షిణ భారతదేశంలో తొలి మహిళా పాలకురాలు రుద్రమదేవి, ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహారావు ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖులు.
తెలంగాణ ప్రాంత పురాతన పేరు త్రిలింగ దేశ అని ఒక వాదన చరిత్రకారుల్లో ఉంది. కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం అనే మూడు శైవక్షేత్రాల మధ్య ఉన్న పవిత్ర ప్రాంతాన్ని తెలంగాణ అంటారని చెబుతున్నారు. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మధ్య కాకతీయులు పాలించిన భూభాగాన్ని త్రిలింగ దేశం అని అంటారని మరొక వాదన ఉంది. త్రిలింగ దేశం కాలక్రమంలో “తెలంగాణ” అనే పదంగా మారిందని చెబుతున్నారు.
