NTV Telugu Site icon

సాగర్‌ ఉపఎన్నికలో లెఫ్ట్‌ పార్టీల దారెటు…?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పక్షాన్ని ఢీకొట్టారు. హోరాహోరీగా సాగుతున్న నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో పోటీకి దూరంగా ఉండిపోయారు. బరిలో లేరు.. సరే! బైఎలక్షన్‌లో ఎవరికి మద్దతిస్తున్నారు? లోకల్‌ కేడర్‌నే నిర్ణయం తీసుకోవాలని చెప్పడం వెనక ఇంకేదైనా కారణం ఉందా? వారు ఇస్తున్న సంకేతాలకు అర్థమేంటి? లెట్స్‌ వాచ్‌!

సాగర్‌లో టీఆర్‌ఎస్‌కు లెఫ్ట్‌ పార్టీలు జైకొట్టాయా? 

ఈ నెల 17నే నాగార్జునసాగర్‌లో పోలింగ్‌. ప్రచారం పీక్‌కు వెళ్లిన సమయంలో లెఫ్ట్‌ పార్టీలు నుంచి వస్తున్న సంకేతాలు రాజకీయంగా వేడి రగిలిస్తున్నాయి. ఈ ఉపఎన్నికలో సీపీఐ, సీపీఎం పోటీ చేయడం లేదు. దీంతో ఆ పార్టీల మద్దతు ఎవరికి అన్న చర్చ ఇన్నాళ్లూ సాగుతూ వచ్చింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వచ్చిన ఉపఎన్నిక కావడంతో లెఫ్ట్‌ వైఖరిపై హైప్‌ మరింత పెరిగింది. ఇప్పుడు వాటిని పటాపంచలు చేస్తూ అధికారపార్టీకి వామపక్షాలు జైకొట్టినట్టు జరుగుతున్న ప్రచారం ఆసక్తి కలిగిస్తోంది. 

2014 ఎన్నికల్లో  సాగర్‌లో సీపీఎంకు 2 వేల ఓట్లు
2018లో లెఫ్ట్‌ మద్దతిచ్చిన బీఎల్‌ఎఫ్‌కు 680 ఓట్లు!

2014లో నాగార్జునసాగర్‌లో సీపీఎం పోటీ చేయగా.. ఆ పార్టీ అభ్యర్థికి 2 వేల ఓట్లు పడ్డాయి.  2018లో లెఫ్ట్‌ పార్టీలు బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ అభ్యర్థికి సపోర్ట్ చేశాయి. BLFకు 680 ఓట్లే వచ్చాయి.  2014, 2018 ఎన్నికలు ఎలా ఉన్నా.. ఇప్పుడు జరుగుతున్న ఉపఎన్నిక లెక్క వేరు. త్రిముఖ పోరు ఉధృతంగా ఉంది. ప్రతి ఓటు కీలకమే. అందుకు తగ్గట్టుగానే పార్టీల ఎన్నికల వ్యూహం ఉంది.  కలిసి వచ్చే సంఘాలను, పార్టీలను వదులుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు.  న్యూట్రల్‌గా ఉన్నవారి మనసును కూడా మార్చే ప్రయత్నంలో నాయకులు ఉన్నారు. ఈ క్రమంలోనే CPI, CPM దారెటు అన్న చర్చ జరిగింది. 

మద్దతుపై నిర్ణయం లోకల్‌ కేడర్‌కు అప్పగించిన లెఫ్ట్‌ పార్టీలు!

ఎవరికి మద్దతు ఇస్తున్నది లెఫ్ట్‌ పార్టీలు అధికారికంగా ప్రకటన చేయలేదు. ఎవరికి ఓటు వేయాలో.. ఇంకెవరికి మద్దతు ఇవ్వాలో నిర్ణయం తీసుకునే బాధ్యతను స్థానిక నాయకత్వానికే వదిలేసినట్టు చెబుతున్నారు. కాకపోతే వారి మొగ్గు అధికార టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్‌లకు మద్దతిచ్చే అవకాశం లేకపోవడంతో.. ప్రత్యామ్నాయంగా గులాబీ పార్టీ వైపు చూసినట్టు చెబుతున్నారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక సమయంలో టీఆర్‌ఎస్‌కు సీపీఐ మద్దతు విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరకు నిర్ణయం లోకల్‌ కేడర్‌కే అప్పగించేశారు. నాగార్జునసాగర్‌లోనూ అదేవ్యూహం అమలు చేస్తున్నాయి వామపక్షాలు.  కాకపోతే హుజూర్‌నగర్‌లో లెఫ్ట్ పార్టీలు టీఆర్‌ఎస్‌కే మద్దతిచ్చాయని ఏ విధంగా చివరి వరకు ప్రచారం జరిగిందో.. అదే సీన్‌ ఇక్కడ కూడా ఎస్టాబ్లిష్‌ అవుతోంది. 

లోపాయికారీగా టీఆర్‌ఎస్‌కు జైకొడితే పరిణామాలు మారతాయా? 

వివిధ రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో లెఫ్ట్‌ పార్టీలు కలిసి సాగుతున్నాయి. ఇక్కడ మాత్రం భిన్నమైన వైఖరిని ఎంచుకున్నాయి. లోపాయి కారీగా టీఆర్‌ఎస్‌కు వామపక్షాలు జై కొట్టిన మాట నిజమే అయితే మాత్రం.. తెలంగాణ రాజకీయ పటంపై కొత్త చిత్రం ఆవిష్కరణ అయినట్టేనని భావిస్తున్నారు విశ్లేషకులు. 2023 ఎన్నికల నాటికి బంధం బలోపేతం కావొచ్చని అప్పుడే కొందరు  చర్చ మొదలుపెట్టేశారు. రాష్ట్రంలో అధికార పార్టీతో లెఫ్ట్‌ పార్టీలు అంటకాగుతాయో లేదో కానీ సాగర్‌ ఉపఎన్నిక మాత్రం వారి వైఖరిపై కొత్త అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.