OTR : కాకరేపుతున్న వెస్ట్ గోదావరి Janasena పాలిటిక్స్.. సొంత పార్టీ నేతలపైనే సొంత తమ్ముళ్ల అసమ్మతి!

Janasena

Janasena

ఎగిరెగిరి దంచినా అంతే కూలి…. ఎగరకుండా దంచినా అంతే కూలి అన్నట్టుగా అక్కడ జనసేన నాయకులు ప్రవర్తిస్తున్నారా? వాళ్ళే పరువును బజారుకు లాగుతున్నారా? గత ఎన్నికల్లో స్టేట్‌ మొత్తం మీద బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ ఇచ్చిన ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు పార్టీ పడుతూ లేస్తోందా? బయటి నుంచి ఎవరో వచ్చి మన పరువు తీయక్కర్లేదని సొంత కేడరే ఎందుకు మాట్లాడుకుంటోంది? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఉత్తుత్తి మీటింగ్స్‌తో సోషల్‌ మీడియాలో అభాసుపాలవుతోంది ఎవరు? ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీ పరిస్థితి తల్లకిందులయ్యేట్టు ఉందని ఆందోళన పడుతున్నారట జనసైనికులు. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల విషయం పక్కన పెడితే… మిగతా నియోజకవర్గాల్లో పార్టీ ఇన్చార్జ్‌లు ఎక్కువ మంది సైలెంట్ అయిపోయినట్టు కనిపిస్తోంది. మనం ఎంత చించుకున్నా…. ఈసారి కూడా సీట్లు ఇవ్వరు, ఆ మాత్రం దానికి తెగ పనిచేసి ఎవర్ని ఉద్ధరించాలంటూ పార్టీని గాలికొదిలేసినట్టు తెలుస్తోంది.

 

పదవుల్లో ఉన్నాం కాబట్టి తప్పదన్నట్టు అప్పుడప్పుడు అధికారిక కార్యక్రమాలకు హాజరవుతూ మమ అనిపిస్తున్నారట జనసేన ఇన్ఛార్జ్‌లు. దీంతో బలంగా ఉన్న జిల్లాలో కార్యకర్తలకు అండగా నిలబడే నాయకులు లేక వీక్ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో… లోకల్ బాడీస్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇన్చార్జ్‌లను ప్రకటిస్తామని పార్టీ అధిష్టానం చెప్పింది. దీంతో…తమ పదవులు ఉంటాయా ఊడతాయ అన్న ఆందోళన కొందరు సీనియర్స్‌లో మొదలైందట. మరి కొందరైతే… ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ…పదవుల్ని కాపాడుకునేందుకు ఉత్తుత్తి మీటింగ్స్‌ పెట్టేస్తున్నారట. రియల్‌గా కార్యకర్తలతో ఎలాంటి మీటింగ్‌ పెట్టకుండానే…. పాత ఫోటోలు, గ్రాఫిక్స్‌తో… మా దగ్గర అద్భుతంగా చేసేశామంటూ పార్టీ హెడ్డాఫీస్‌కు సమాచారం ఇస్తున్నట్టు తెలిసింది. ఇటీవల ఏలూరు అసెంబ్లీ ఇన్చార్జ్‌ రెడ్డి అప్పలనాయుడు విషయంలోనూ ఇదే జరిగిందని సమాచారం. గతంలో ఎప్పుడో జరిగిన సమావేశానికి సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి లేటెస్ట్‌ బిల్డప్‌ ఇవ్వడం పెద్ద దూమారమే రేపింది. విజయవాడ జోన్‌ RTC చైర్మన్ గా నామినేటెడ్ పదవి నిర్వహిస్తున్న అప్పలనాయుడు 15రోజులకోసారి ఫోన్ ఆన్ చేస్తారని, పార్టీ క్యాడర్‌ను పట్టించుకోకపోవడంతో ఆయన ఇన్ఛార్జ్‌ పదవి డేంజర్‌లో పడ్డట్టు చెప్పుకుంటున్నారు.

ఇదే సమయంలో అధినేతకు సన్నిహితంగా ఉండే మరో నాయకుడిని ఏలూరు అసెంబ్లీ ఇన్చార్జ్‌గా ప్రకటిస్తారనే ప్రచారం నడుస్తోంది. దీంతో… అలర్ట్ అయిన అప్పలనాయుడు గ్రాఫిక్‌ మీటింగ్స్‌తో పార్టీ పెద్దల్ని బురిడీ కొట్టించే ప్లాన్‌ వేశారంటూ సోషల్ మీడియాలో సొంత పార్టీ నాయకులే ఏకిపారేస్తున్నారు. పదవులు పోతాయనే భయంతో ఇపుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేనలో చాలామంది తిమ్మిని బమ్మిని చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. గోపాలపురం నియోజకవర్గంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న ఇన్చార్జి కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడంతో అక్కడ కూడా మరో మహిళకు ఇస్తారనే ప్రచారం ఉంది. చింతలపూడి, ఆచంట, తణుకు నియోజకవర్గాలలో కొత్త నేతలకు అవకాశం కల్పించబోతున్నారన్న వార్తలతో ఇటు సీనియర్ నేతలు, అటు ఆశావాహులు పార్టీ ఆఫీస్‌ చుట్టూ చక్కర్లు కొడుతున్నారట. అయితే ఇందులో కొందరు…. పదవులు నిలబెట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలతో పార్టీ పరువు నడిబజార్లో పోతోందన్న ఆవేద కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది.
ఇది చూస్తున్న చాలామంది జనసేన లీడర్స్‌… వేరే ఎవరో వచ్చి మన పరువు తీయనవసరం లేదని సెటైరిక్‌గా మాట్లాడుకుంటున్నారు. అవసరమైన సమయంలో పనిచేయకుండా, పార్టీని బలోపేతం చేయకుండా…. తీరా ఇప్పుడు పదవుల్ని నిలబెట్టుకునేందుకు చేస్తున్న విన్యాసాల్ని అధిష్టానం ఎంతవరకు పట్టించుకుంటుందన్న ప్రశ్నలు సైతం ఉన్నాయి. వేరే ఎక్కడా లేని విధంగా…. ఉమ్మడి పశ్చిమలో ఆరు ఎమ్మెల్యే సీట్లు గెల్చుకుంది జనసేన. కానీ… ఇప్పుడు ఇన్ఛార్జ్‌లు సరిగా పనిచేయకపోవడంతో… ఆ ఇమేజ్‌ మొత్తం డ్యామేజ్‌ అవుతోందన్నది కేడర్‌ ఆవేదన. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఇపుడు కొత్త వాళ్ళని తీసుకుని వస్తేనే….. వచ్చే ఎన్నికల్లో పాత సీన్ రిపీట్ అవుతుందని, లేదంటే పని చేయని ఇన్చార్జిలతో పరువు పోతుందంటున్నారు జిల్లా జనసైనికులు..