తెలంగాణలో మరో రాజకీయ వివాదం పురుడు పోసుకోబోతోందా? S I Rతో ఓట్ల వడపోత వివాదాలకు దారితీసే అవకాశం ఉందా? ఈ విషయంలో బీజేపీ స్పెషల్ స్కెచ్తో సిద్ధమవుతోందా? ప్రత్యేకించి హైదరాబాద్ ఓల్డ్సిటీ మీద కాషాయ దళం ఫోకస్ పెట్టాలనుకుంటోందా? అందుకోసం ఆ పార్టీ దగ్గరున్న ప్లాన్స్ ఏంటి? ఏం చేయాలనుకుంటోంది? తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి ఓటర్ లిస్ట్ సవరణకు సంబంధించిన ప్రోగ్రామ్…స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ S I R మొదలవబోతోంది. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాలు కూడా నిర్వహించింది. అధికారుల నియామకం పూర్తయింది. బూత్ లెవల్ ఏజెంట్స్ని నియమించుకోవాలని రాజకీయ పార్టీలకు కూడా ఎన్నికల సంఘం సూచించింది. ఈ క్రమంలోనే… బీజేపీ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోందట. అన్నిటికీ మించి ఓటర్ లిస్ట్ ఇంటెన్సివ్ రివిజన్కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర పార్టీ నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర నాయకులు అటెండ్ అయ్యారు. ఓటర్ల జాబితా రివిజన్ సందర్భంగా పార్టీ పరంగా ఏం చేయాలన్న విషయమై ఢిల్లీ పెద్దలు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ప్రతి నియోజక వర్గానికి ఒక బూత్ లెవెల్ ఏజెంట్ నియమించాలని, వాళ్ళు ఇచ్చే లిస్ట్ను పైకి పంపించాలని ఇప్పటికే కేంద్ర కమిటీ రాష్ర్ట పార్టీని ఆదేశించింది. అందుకు తగ్గట్టే ఢిల్లీ మీటింగ్కు ఆ లిస్ట్తో వెళ్ళారు రాష్ట్ర నాయకులు. ఇక ప్రతి పోలింగ్ బూత్కు ఒక ఏజెంట్ను పెట్టడంతో పాటు ఆ ఎంపికలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
ఏదో ఆషామాషీగా మమ అనిపించకుండా… ఆ బూత్ పరిధిలో ఎక్కువ కాలం నుంచి నివాసం ఉంటూ.. విస్తృత పరిచయాలున్న వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వమని అన్నట్టు సమాచారం. అటు S I R పై పలు రాష్ట్రాల్లో రచ్చ జరుగుతోంది. బెంగాల్లో ఆ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అర్హులైన వాళ్ళను ఓటర్ జాబితా నుండి తొలగించారన్న ఆరోపణలు గట్టిగా ఉన్నాయి. ఇప్పటికే SIR జరిగిన రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లు తగ్గిపోయాయి. అలా ఎందుకు జరుగుతోందని అంటే… చనిపోయినవారు, వలస వెళ్ళిన వారు, ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు ఉన్న వారి పేర్లను తొలగించామన్నది ఎన్నికల సంఘం సమాధానం. ఇప్పుడు తెలంగాణలో కూడా ఓటర్ జాబితా సవరణపై రచ్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. ప్రత్యేకించి హైదరాబాద్ సంగతేంటన్న చర్చ తెర మీదికి వస్తోంది. నగరంలో చాలా చోట్ల వేలాదిగా దొంగ ఓట్లు నమోదు చేశారంటూ బీజేపీతో పాటు పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి.
అయితే బీజేపీ మాత్రం హైదరాబాద్ పాతబస్తీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగబోతున్నందున ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాలనుకుంటున్నట్టు సమాచారం. ఇక్కడ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, అక్రమ చొరబాటు దారులు మకాం వేశారని ఆరోపిస్తోంది బీజేపీ. అందుకే అలాంటి వాళ్ళ ఓట్ల నమోదు విషయంలో అలర్ట్గా ఉండాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక మీదట ఒక్క దొంగ ఓటు కూడా నమోదవకుండా చూసేలా ఏజెంట్స్ని ఫిక్స్ చేయాలనుకుంటోంది కమలం పార్టీ. అలాగే అన్ని జిల్లా కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకోబోతున్నారట కమల నాథులు. అర్హుల ఓట్లు ఉండేలా, అనర్హుల ఓట్లు లిస్ట్లో ఎక్కకుండా కనిపించకుండా చేయాలని బీజేపీ కంకణం కట్టుకున్నట్టు చెబుతున్నారు ఆ పార్టీ నాయకులు. ఈ లెక్కన చూస్తే… తెలంగాణలో కూడా భారీ సంఖ్యలో ఓట్లు తగ్గే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. దీని మీద రాష్ట్రంలో ఎంత రాజకీయ రచ్చ జరుగుతుందో చూడాలి మరి.
