OTR: చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కొత్త లొల్లి..?

Kuppam

Kuppam

కుప్పం టీడీపీ కోటలో సరికొత్త టెన్షన్ మొదలైందా? పార్టీ బాధ్యతల నాయకత్వ మార్పు జరిగి ఇరవై రోజులు కూడా అవకముందే తమ్ముళ్లు తెగ కంగారు పడిపోతున్నారా? కొత్తగా బాధ్యతలు తీసుకున్న వ్యక్తి కేడర్‌తో సింక్‌ అవలేకపోతున్నారా? లేక అంతకు మించిన వేరే కారణాలు ఉన్నాయా? ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో సొంత కేడర్‌ ఎందుకు కంగారు పడుతోంది? ఇన్‌సైడ్‌ మేటర్స్‌ ఏంటి?

కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా 8 సార్లు విజయం సాధించి రికార్డ్ సృష్టించారు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి హోదాలో ఎంత బిజీగా ఉన్నా…. సొంత నియోజకవర్గం మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారాయన. అయితే… ఇటీవల నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను తప్పించారు. ఆయన స్థానంలో అనంతపురం జిల్లాకు చెందిన, పార్టీలో పీ4 పథకాన్ని పర్యవేక్షించిన మరో శ్రీకాంత్‌కు పీఏగా బాధ్యతలు అప్పగించడం సంచలనమైంది.తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో సొంత నియోజకవర్గ నేతలపై చంద్రబాబు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి అని సీనియర్ నేతలు చర్చించుకున్నారు.​ నిజానికి కుప్పంలో ఏళ్ల తరబడి చక్రం తిప్పిన పాత నేతల వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు రావడం, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో గతంలోనే మార్పులు చేశారు చంద్రబాబు. ఆ క్రమంలోనే కంచర్ల శ్రీకాంత్‌కు బాధ్యతలు అప్పగించారు.

 

మొదట దూకుడు బాగానే పని చేసినా తర్వాత ఆయనకు, స్థానిక నేతలకు పూర్తిగా బెడిసికొట్టిందట. ఆ మధ్య ఓ సమావేశంలో ఏకంగా బహిరంగ వేదికలపైనే పరస్పరం విమర్శలు చేసుకునే స్థాయికి గొడవలు వెళ్లడంతో పార్టీ ప్రతిష్ట వీధిన పడిందంటూ అధిష్ఠానం సీరియస్ అయింది. విజయవాడలో జరిగిన నియోజకవర్గ కీలక నేతల సమావేశంలో కంచర్ల శ్రీకాంత్‌ను ఉద్దేశించి.. మీరు కుప్పానికి చాలా సేవ చేశారు, ఇకపై నేనే స్వయంగా నియోజకవర్గ వ్యవహారాలు చూసుకుంటాను అని సున్నితంగా చెప్పి పంపేశారు సీఎం. దిద్దుబాటు చర్యల్లో భాగంగా అనంతపురం జిల్లాకు చెందిన శ్రీకాంత్‌కు కొత్తగా కుప్పం సమన్వయ బాధ్యతలు అప్పగించారు. కట్ చేస్తే… ఇప్పుడు కుప్పం కోటలో సరికొత్త లొల్లి మొదలైందట. కొత్తగా వచ్చిన యంగ్ అండ్‌ ప్రొఫెషనల్ పీఏ శ్రీకాంత్ 12 రోజులుగా కుప్పంలోనే ఉంటూ ప్రభుత్వ పరమైన కార్యక్రమాలను గట్టిగానే పర్యవేక్షిస్తున్నారట. అంతవరకు ఢోకాలేదుగానీ… అసలు తేడా కూడా అక్కడే వచ్చిందని అంటున్నారు స్థానిక నాయకులు. ప్రభుత్వం కార్యక్రమాల పర్యవేక్షణ వరకు సరేగానీ… మా పొలిటికల్ పనులు, మాకున్న స్థానిక సమస్యలు ఎవరు తీరుస్తారంటూ కుప్పం టీడీపీ నేతలు, కార్యకర్తలు లోలోపల మధనపడుతున్నారట. అందుకో రాజకీయ నేపధ్యం ఉన్న వ్యక్తి కావాలన్నది వాళ్ళ వాయిస్‌. కొత్త పీఏ శ్రీకాంత్ ఒక అధికారిలా… కేవలం అధికారిక ఫైళ్లు, లబ్ధిదారుల లెక్కలు చూసుకుంటున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు వచ్చే రాజకీయ ఇబ్బందులను పట్టించుకోవడం లేదనేది గ్రౌండ్ రియాలిటీ. రాజకీయ సమస్యలను కొత్త పీఏతో చెప్పుకోలేకపోతున్నామని కేడర్‌ కూడా ఫీలవుతోందట.

అయితే ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వెళ్ళిపోయాక కుప్పంలో ఏర్పడ్డ పొలిటికల్ స్పేస్ ను భర్తీ చేసేందుకు స్థానిక నేతలు చొరవ తీసుకుంటున్నారన్నది ఇంకో వెర్షన్‌. దీంతో… వాళ్ళలో ఒకర్ని ఎంపిక చేసి పూర్తి బాధ్యతలు అప్పగిస్తారా? లేక మకో కొత్త వ్యక్తిని దింపుతారా అన్నది ఆసక్తిగా మారింది. కార్యకర్తలు కొందరు మునిరత్నం వైపు ఉంటే, మరికొందరు డాక్టర్ సురేష్ పేరును తెరపైకి తెస్తున్నారట. త్వరలోనే ముఖ్యమంత్రి మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు.

అప్పుడు కొత్తగా పొలిటికల్ ఇన్చార్జ్ ప్రకటన చేస్తారేమోనని ఉత్కంఠగా చూస్తున్నారు తమ్ముళ్ళు. చంద్రబాబు ఈ ఇద్దరిలో ఒకరివైపు మొగ్గు చూపుతారా లేక ఎవరూ ఊహించని కొత్త సారధి తెర మీదికి వస్తారా అన్నది ఇంట్రస్టింగ్‌ పాయింట్‌. ఏ నిర్ణయం తీసుకున్నా… పొలిటికల్‌గా మాకో గట్టి నాయకుడు కావాలి సార్ అంటూ విన్నపాలు చేసుకుంటున్నారు తమ్ముళ్ళు. అక్రమ మైనింగ్, అవినీతి మార్గాల్లో ఉండే నేతలు కుప్పంలో నాకు అక్కర్లేదని బాబు ఇప్పటికే కఠినంగా హెచ్చరించారు.
అటు ప్రభుత్వ కార్యక్రమాలను కొత్త పీఏ చూసుకుంటుండగా, ఇటు పొలిటికల్ బాధ్యతల అప్పగింతే ఆసక్తిగా మారింది.