తెలంగాణలో మొన్నటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ సీటు కోల్పోయిన బీజేపీ.. ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ సీటుపై ఫోకస్ పెట్టింది. అభ్యర్థిని కూడా ప్రకటించింది. అభ్యర్థి విషయంలోనే ఎడతెగని మంతనాలు జరిగాయట. అంతా అయిపోయాక పరివార్ క్షేత్రాల నుంచి కొందరు మా సంగతేంటని ప్రశ్నించడంతో రసకందాయంలో పడ్డాయి కాషాయం పార్టీ రాజకీయాలు.
బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏవీఎన్ రెడ్డి పేరు ప్రకటన
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఎన్నిక జరగనుంది. ఇప్పటికే వివిధ ఉపాధ్యాయ సంఘాలు తమ అభ్యర్థులను ప్రకటించాయి ప్రచారం మొదలు పెట్టాయి. బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది. అభ్యర్థిని ప్రకటించింది. దిల్షుక్నగర్ పబ్లిక్ స్కూల్ అధినేత AVN రెడ్డిని క్యాండిడేట్గా అనౌన్స్ చేసింది బీజేపీ. ఇక్కడి వరకు అంతా సాఫీగా సాగినా.. అభ్యర్థి పేరు ప్రకటించాకే సంఘ్ పరివార్ క్షేత్రాల నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయట.
ముందుగా సంఘ్ పెద్దలతో మాట్లాడిన బీజేపీ నేతలు
వాస్తవానికి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్న బీజేపీ నేతలు.. ఆర్ఎస్ఎస్ పెద్దలతోపాటు.. సంఘ్కు అనుబంధంగా ఉన్న ఉపాధ్యాయ సంఘాన్ని కూడా వాకబు చేశారట. ఆర్ఎస్ఎస్ పెద్దలు తాము జోక్యం చేసుకోబోమని చెప్పారట. TPUS ప్రతినిధులు సైతం.. గతంలో తాము అభ్యర్థిని పెట్టి ప్రచారం చేయలేక ఇబ్బంది పడ్డామని.. అందువల్ల ఈ ఎన్నికల్లో ఎవరినీ పోటీకి పెట్టడం లేదని తెలిపారట. ఆ తర్వాత బీజేపీ AVN రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిందని చెబుతున్నారు. అయితే ఈ మంత్రాంగాల గురించి తెలుసో లేదో కానీ.. బీజేపీ నిర్ణయం తీసుకున్న తర్వాత సంఘ్ పరివార్ క్షేత్రల నుంచి కొందరు తాము పోటీ చేస్తామని ముందుకొచ్చారట. PRTU రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగి బీజేపీలో చేరిన వెంకటరెడ్డితోపాటు గతంలో ABVPలో పనిచేసిన ఒకరు తమకు అవకాశం ఇవ్వాలని కోరారట. వెంకటరెడ్డి అయితే ఓటర్ల నమోదు చేపట్టారట. అప్పటికే నిర్ణయం తీసేసుకోవడంతో బీజేపీ నేతలు చేతులు ఎత్తేసినట్టు సమాచారం. ఏదైనా ఉంటే సంఘ్ పెద్దలతో మాట్లాడుకుని జాతీయ పార్టీ నేతలకు చెప్పాలని కమలనాథులు తప్పుకొన్నారట.
ఫేస్బుక్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోస్టింగ్స్
గతంలో ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఓడిన బీజేపీ నేత పేరాల శేఖర్రావు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఫేస్బుక్లో కామెంట్స్ చేయడంతో చర్చగా మారింది. గెలుపోటములు పక్కన పెడితే.. అభ్యర్థి విషయంలోనే ఇంత తతంగం నడవడంతో ఆశ్చర్యపోతున్నారట కమలనాథులు. ఇక ప్రచారంలో ఇంకెన్ని పదనిసలు చూడాలో అని చెవులు కొరుక్కుంటున్నారట.