Site icon NTV Telugu

Off The Record: టీడీపీలో ఉండి వైసీపీ నేతల్ని జాగ్రత్తగా చూసుకోమనడం ఏంటి? .. ఆ మాజీ ఎమ్మెల్యే అలా ఎందుకు మాట్లాడారు?

Otr Vangaveeti Radha

Otr Vangaveeti Radha

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. గతంలో….. అంటే, 2014 నుంచి 19 మధ్య వైసీపీలో యాక్టివ్‌ పాలిటిక్స్‌ చేశారాయన. 2014లో వైసీపీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారాయన. ఇక 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి కొనసాగుతున్నారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక రాధాకు కీలక పదవి దక్కుతుందని ఆయన వర్గం ఆశించినా.. ఇప్పటివరకు కనీసం అలాంటి వాసనలు కూడా లేవు. రాధా వైసీపీ నుంచి టిడిపిలో చేరే సమయంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. అయినా డోంట్‌ కేర్‌ అన్నారాయన. రాధా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ… ఎప్పుడూ ఒక కులానికే పరిమితం అయ్యేలా వ్యాఖ్యలు చేయలేదు. అలాగే పార్టీలకు అతీతంగా అన్నిచోట్ల ఆయనకు సంబంధాలు ఉన్నాయి. అదంతా ఒక ఎత్తయితే….. ఇప్పుడు తన తండ్రి రంగా విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాటలు కొత్తగా కనిపిస్తున్నాయంటూ రాజకీయ చర్చలు బయలుదేరాయి. వంగవీటి రంగాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు. ప్రధానంగా ఏపీలోని కోస్తా జిల్లాల్లో ఆయన విగ్రహాలు ఎక్కువగా ఏర్పాటు చేస్తుంటారు. ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు ఇప్పటికీ పార్టీలకు అతీతంగా నాయకులు హాజరవుతుంటారు. ఈ క్రమంలో కాకినాడ జిల్లా డి.పోలవరం మండలంలో తాజాగా తన తండ్రి రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు రాధా.

ఇదే కార్యక్రమానికి వైసీపీ నేతలు దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు జక్కంపూడి గణేష్ అటెండ్‌ అయ్యారు. ఇక విగ్రహ ఆవిష్కరణ తర్వాత రాధా మాట్లాడుతూ దాడిశెట్టి రాజాకి, జక్కంపూడి గణేష్‌కి అందరూ అండగా నిలవాలి, వాళ్లకు మీ ఆశీర్వచనాలు ఉండాలని అన్నారు. వాళ్లు బలంగా ఉంటే మీకు అండగా ఉంటారంటూ రాధా చేసిన వ్యాఖ్యలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటి గురించి పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌ హాట్‌ డిబేట్స్‌ నడుస్తున్నాయి. ఈ మాటల వెనక ఆయన ఉద్దేశ్యం ఏంటంటూ ఆరాలు తీస్తున్నారు చాలామంది. తాను టీడీపీలో ఉండి వైసీపీ నాయకుల్ని జాగ్రత్తగా చూసుకోమని అక్కడికి వచ్చిన వాళ్ళతో అన్నారంటే…. రాధా మాటల మర్మం ఏంటంటూ సమాధానం వెదికే ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది.రాధా టీడీపీలో చేరిన తర్వాత…. అంటే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలోనే ఆయన్ని తిరిగి తీసుకు వెళ్ళటానికి ఆ పార్టీలో ఉన్న స్నేహితులు మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ తీవ్రంగా ప్రయత్నించారు. అయినా అప్పుడు పార్టీ మారడానికి ఆయన ఇష్టపడలేదన్నది రాజకీయ వర్గాల మాట. ఇక …24 ఎన్నికలు రావడం, కూటమి చేతిలోకి పవర్‌ మారడం తర్వాతి పరిణామాలు.

అధికార మార్పిడి జరిగి రెండేళ్ళు కావస్తున్నా… ఇప్పటి వరకు రాధాకు ఎలాంటి పదవి ఆఫర్‌ లేదు. అటు 2019, 24 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా పార్టీకి ప్రచారం చేసినా….ఇచ్చే విలువ ఇదేనా అంటూ అసంతృప్తిగా ఉంది రాధా వర్గం. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని ఎదురు చూస్తున్నారు అనుచరులు. ఈ క్రమంలో…ఇటీవల అంబటి రాంబాబు ఇంటి మీద జరిగిన దాడి రాజకీయ వేడి రగిల్చింది. ఒక దశలో అది కాపు నేత మీద జరిగిన దాడిగా కూడా ప్రొజెక్ట్‌ అయింది. ఆ టైంలో…. అంబటి వ్యాఖ్యల మీద స్పందించాలని రాధాను టీడీపీ అధిష్టానం కోరిందట. అయినా సరే… నేను ఎప్పుడూ కులాల ప్రాతిపదికన మాట్లాడలేదు, ఇప్పుడు కూడా మాట్లాడలేనని చెప్పారని అంటున్నారు ఆయన సన్నిహితులు. అలాంటి వ్యక్తి… ఇప్పుడు కొత్తగా…. వైసీపీలో కాపు నేతలుగా ఉన్న దాడిశెట్టి రాజా, జక్కంపూడి గణేష్‌కు సపోర్ట్ గా మాట్లాడటం, వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం చర్చనీయాంశమైంది. అయితే… ఈ విషయంలో ఆయన సన్నిహితుల వెర్షన్ వేరుగా ఉంది. రంగా విగ్రహావిష్కరణకు పార్టీలకు అతీతంగా వచ్చే నేతలతో రాధా ఆప్యాయంగా ఉంటారని, ఇప్పుడు కూడా ఆ యాంగిల్‌లో మాట్లాడారు తప్ప.. వేరే ఆలోచనలేవీ లేవని అంటున్నారు. ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయో తేలాలంటే… ఇంకొన్నాళ్ళు ఆగాలని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Exit mobile version