Site icon NTV Telugu

Off The Record: ఇష్టం లేకున్నా తప్పక ఆ పదవిలో ఉంటున్నారా?

Otr Thammineni

Otr Thammineni

Off The Record: సిక్కోలు పొలిటికల్‌ సీనియర్స్ ఫస్ట్‌ రో లో ఉండే లీడర్‌, ఆ మాటకొస్తే… రాష్ట్రంలోని పాపులర్‌ నాయకుల్లో ఒకరు తమ్మినేని సీతారామ్‌. వైసీపీ హయాంలో అసెంబ్లీ స్పీకర్‌గా ఆయన తీరును తీవ్రంగా తప్పు పట్టాయి అప్పటి ప్రతిపక్షాలు. ఇక పవర్‌ పోయాక పార్టీ శ్రీకాకుళం లోక్‌సభ ఇన్ఛార్జ్‌గా కొనసాగుతున్నారాయన. అయితే ఆ పదవి ఇష్టం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ పెద్దల మాట కాదనలేక తీసుకున్నా…మనస్ఫూర్తిగా బాధ్యతలు నిర్వహించలేకపోతున్నారన్నది ఇప్పుడు లోకల్‌ టాక్‌. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే బాధ్యత తీసుకోవాల్సి వచ్చిందని ఇటీవల తరచూ సన్నిహితులతో అంటున్నారట సీతారామ్‌. ఆమదాలవలస ఆయన సొంత అసెంబ్లీ నియోజకవర్గం. అక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. ఇక 2024 ఎన్నికల్లో ఓడిపోయాక సెగ్మెంట్‌ ఇన్ఛార్జ్‌గా ఆయన్ని తప్పించి చింతాడ రవికుమార్‌కు అప్పగించింది వైసీపీ అధిష్టానం. అందుకు బదులుగా జిల్లా పార్టీతో పాటు రాష్ట్ర స్థాయిలో సముచిత స్దానం కల్పిస్తామన్న భరోసా వచ్చిందట తమ్మినేనికి.

అలాగే… శ్రీకాకుళం పార్లమెంట్ ఇంచార్జ్ బాధ్యతలు తీసుకోమని కోరడంతో… ఇష్టం లేకపోయినా ఓకే చెప్పాల్సి వచ్చిందన్నది ఆయనతో పాటు జిల్లాలో అంతా చెప్పే మాట. ఆ అసంతృప్తితోనే ఇప్పుడు ఏ విషయంలోనూ పెద్దగా స్పందించడం లేదని, ఆయనలో మునుపటి ఫైర్‌ కనిపించడం లేదని జిల్లా వైసీపీలో గట్టి చర్చే జరుగుతోంది. వాస్తవానికి వాగ్ధాటే తమ్మినేనికి ప్రధానమైన బలం. శాసనసభాపతిగా రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి కూడా… నాడు పార్టీని గట్టిగా సపోర్ట్‌ చేశారని అంటారు. అలాగే… నియోజకవర్గ రాజకీయాలు, కార్యకర్తల అవసరాలు, అప్పటి ప్రభుత్వానికి అండగా ఉండటం లాంటి అంశాలన్నిటిలో తానున్న పదవితో నిమిత్తం లేకుండానే వ్యవహరించేవారు. అలాంటి నాయకులు ఇప్పుడు అస్సలు తనకేం పట్టదన్నట్టుగా వ్యవహరించడానికి కారణం తనను ఆమదాలవలసకు దూరం చేస్తున్నారన్న అసంతృప్తేనని అంటున్నాయి వైసీపీ వర్గాలు. పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నా, అడపాదడపా కూటమి నేతలల్ని విమర్శిస్తున్నా…. తమ్మినేని నుంచి ఆశిస్తోంది మాత్రం ఈ రియాక్షన్‌ కాదంటున్నారు కార్యకర్తలు. లోక్‌సభ నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా యాక్టివ్‌ రోల్‌ పోషించాలని కోరుతున్నారు.

టిక్కెట్లు, సీట్ల పంచాయితీకి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి… ముందు పార్టీని బలోపేతం చేయడం మీద దృష్టి పెట్టాలని కోరుతున్నారు ద్వితీయ శ్రేణి నేతలు. ఇచ్చాపురం , టెక్కలిలో హ్యాట్రిక్ విజయాలు సాధించింది టీడీపీ. అలాంటి చోట ఇప్పట్నుంచే గ్రౌండ్ వర్క్ మొదలు పెడితేనే ఉనికి చాటుకోగలమని, కాదని వదిలేస్తే మరోసారి ఎమ్మెల్యే సీట్లు వదులుకోక తప్పదన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. అంతర్గత కుమ్ములాటలు, విభేదాలను పరిష్కరించడం కోసం జిల్లా పార్టీ అధ్యక్షుడు కృష్ణదాస్‌తో కలిసి సమన్వయం చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే తమ్మినేని సీతారామ్‌ ఆలోచన మాత్రం వేరుగా ఉందట. వాళ్లకేం… చెప్పేవాళ్ళు ఎన్నయినా చెబుతారు, ఇప్పుడు లోక్ సభ పరిధిలో పట్టుకోసం ప్రయత్నిస్తే….సొంత నియోజకవర్గంలోనే సడలిపోతుందని సన్నిహితులతో అంటున్నట్టు సమాచారం. అలాగే… తన కుమారుడు నాని రాజకీయ భవిష్యత్‌ను కూడా సెట్ చేయాలంటే… ఆమదాలవలసని వదలకూడదన్నది ఆయన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారట మాజీ స్పీకర్‌.

Exit mobile version