Site icon NTV Telugu

Off The Record: మంత్రి – మాజీ మంత్రి – ఇంచార్జ్.. రాజంపేటలో అసలు పవర్ గేమ్ ఎవరిది?

Rajampet Otr

Rajampet Otr

Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని ఆధిక్యం సాధించిన కూటమికి గత ఎన్నికల్లో ఇబ్బందికర పరిణామాలు ఎదురైన ఏకైక ప్రాంతం రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం. ఇక్కడ మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్‌తో పాటు ఎంపీ సీటు కూడా కోల్పోయింది కూటమి. గెలిచే అవకాశాలున్నా…. స్థానిక నేతల వ్యవహార శైలి, అభ్యర్థుల ఎంపికలో లోపాలే అందుకు కారణం అని క్లారిటీకి వచ్చింది టీడీపీ అధిష్టానం. అందుకే ఇక్కడ పార్టీని బలోపేతం చేయడంతోపాటు ప్రత్యర్థి వైసీపీని దెబ్బకొట్టేందుకు అధినేత ప్రయత్నిస్తున్నా పెద్దగా వర్కౌట్‌ అవడంలేదని తెలుస్తోంది. స్థానిక నేతల మధ్య ఉన్న విభేదాలే అందుకు కారణం అన్నది కేడర్‌ వాయిస్‌. గత ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిన సుబ్రమణ్యం వైసీపీలో చేరగా, తంబళ్లపల్లి నుంచి పోటీ చేసి ఓడిన జయచంద్రారెడ్డి నకిలీ మద్యం కేసులో ఇరుక్కుని పార్టీ నుంచి సస్పెండ్ అయి అజ్ఞాతంలో ఉన్నారు. ఇక అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి మార్చడం, జిల్లాల పునర్విభజనలో జరిగిన మరికొన్ని మార్పుల ప్రభావం కూడా ఉందని అంటున్నారు. అలాగే దిద్దుబాటు చర్యల్లో భాగంగా…. రాజంపేట ఎంపీ సీటు పరిధిలో సంఖ్యా పరంగా బలంగా ఉన్న బలిజ సామాజిక వర్గానికి చెందిన సుగవాసి ప్రసాద్‌ను పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడిగా, మైనార్టీ విభాగానికి చెందిన పఠాన్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అయితే… ఈ ఎంపికకు ముందే పార్టీ గ్రూపులుగా ఉండటం మైనస్ అవుతోందన్న విశ్లేషణలున్నాయి.

మంత్రి రాంప్రసాద్ రెడ్డి వర్గంలో పుంగనూరు ఇన్‌చార్జ్ చల్లాబాబు రెడ్డి, జయచంద్రారెడ్డి ఉన్నారు. వీరితో పాటు మదనపల్లి నుంచి ఎమ్మెల్యే షాజహాన్ వ్యతిరేక వర్గం సైతం మంత్రితో చేరింది. ఇదే సమయంలో పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ ఓ గ్రూపుగా మారిపోయారు. అటు పుంగనూరు, పీలేరు, మదనపల్లిలో మూడవ వర్గంగా మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్ ఉన్నారు. కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న మూడు వర్గాల నాయకులు ఈ మధ్య ఎవరికి వారు బలప్రదర్శనలకు దిగుతున్నారట… పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు ప్రసాద్ వారం రెండు రోజుల పాటు తాను జిల్లా కేంద్రం అయిన మదనపల్లిలో ఉండి కార్యకర్తలను కలుస్తానని ప్రకటిస్తే….ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సైతం తాను కార్యాలయంలో అందుబాటులో ఉంటానని చెబుతూ…లోకల్ ఎమ్మెల్యే షాజహాన్ భాషాతో కలిసి హడావుడి చేస్తున్నారట. దీనికి కౌంటర్ గా మంత్రి రాంప్రసాద్ రెడ్డి వర్గం సైతం ఇదే రీతిలో హంగామా సృష్టిస్తోందని చెబుతున్నారు. వారంలో ఒకరోజు జిల్లా కేంద్రం మదనపల్లిలో ఉండి ప్రజా సమస్యలపై అర్జీలు తీసుకుంటున్నారు మంత్రి. ఆయన ఈ మధ్య వచ్చినప్పుడు ద్విచక్రవాహనాల ర్యాలీతో తెగ హడావుడి చేసింది ఆ వర్గం. మంత్రితో పాటు పుంగనూరు ఇన్‌చార్జ్‌ చల్లా రామచంద్రారెడ్డి కూడా హడావుడి చేశారు. వీళ్ళిద్దరి మధ్యలో మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి వర్గం నేతలు కూడా మనకూ టైం రాకపోతుందా అంటూ ఆత్రంగా చూస్తున్నట్టు సమాచారం.

ఏడాదిన్నరగా ఇటువైపు చూడని ఈ మూడు గ్రూపుల నాయకులు మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించగానే…. వచ్చేసి ఎక్కడ లేని ప్రేమలు ఒలకబోస్తున్నారంటూ ఫైరవుతోంది లోకల్ క్యాడర్. గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవడం, గెలిచే అవకాశం ఉన్నచోట కూడా పార్టీని బలహీనపరచడం తప్ప వీరు చేసిందేమీ లేదన్నది కేడర్‌ మాట. మదనపల్లి డివిజన్ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక భూ కబ్జాల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. మరోవైపు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, టీడీపీ కేడర్‌కు కనీస మర్యాద ఇవ్వడం లేదని చెప్పుకుంటున్నారు. ఎంతసేపూ… ఎవరికి వారు బలప్రదర్శనల హడావుడి తప్ప పార్టీ బలేపేతం కోసం కనీస కార్యక్రమాలు కూడా చేయడంలేదని అంటున్నారు. ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టమయ్యే ప్రమాదం ఉందని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే మంత్రి మీద, మాజీ మంత్రి మీద ఫైర్ అవుతున్నారు. మరి రాజంపేట లోక్‌సభ సీటును పార్టీ పెద్దలు సెట్‌ చేస్తారో, లేక ఇలాగే వదిలేస్తారో చూడాలి మరి.

Exit mobile version