Site icon NTV Telugu

Off The Record: హుండీ మీద పొలిటికల్‌ కళ్లు పడ్డాయా..? పెత్తనం కోసం టీడీపీలోని రెండు వర్గాల పోటీ..

Otr Chengalamma Temple Trus

Otr Chengalamma Temple Trus

Off The Record: సూళ్ళూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఆంధ్రా, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో అత్యంత ప్రాశస్త్యం ఉన్న టెంపుల్‌ ఇది. హుండీ, విరాళాలు అన్నీ కలిపి ఏడాదికి ఐదు కోట్లకు పైనే ఆదాయం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇక్కడ పెత్తనం కోసం పొలిటికల్ ప్రాణాలు తహతహలాడుతున్నాయట. పోటాపోటీగా పావులు కదుపుతూ…తమ వర్గానికే ట్రస్ట్‌ బోర్డ్‌ పదవులు దక్కేలా ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీ ముఖ్యులు పలువురు ప్రయత్నిస్తుండటం ఆసక్తి రేపుతోంది. అమ్మవారి సేవ, ఆలయ అభివృద్ధి అంటూ పైకి ఎన్ని పురాణాలు చెప్పినా…. ఆంతర్యం మాత్రం హుండీ మీద పెత్తనం, కావాల్సిన వాళ్ళకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టి అమ్మ పేరుతో నాలుగు రాళ్ళు వెనకేసుకోవడమేనన్న అభిప్రాయం బలంగా ఉంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో. సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లోచి పట్టున్న వ్యాపారవేత్త కొండేపాటి గంగాప్రసాద్ తన అనుచరుడు తిరుమూరు సుధాకర్ రెడ్డికి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఇప్పించుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారట. ఆయనకు ఎమ్మెల్యే విజయశ్రీ, ఆమె తండ్రి నెలవల సుబ్రమణ్యం సపోర్ట్ కూడా ఉందన్నది లోకల్‌ వాయిస్‌. మరోపక్క కరుడు గట్టిన టిడిపి కుటుంబంగా ఉన్న వేనాటి సతీష్ రెడ్డి సైతం తన తమ్ముడు వేనాటి సురేష్ రెడ్డికి ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. అధికారం లేనప్పుడు పార్టీకి అండగా ఉన్న తమను కాదని అధిష్టానం ముందుకు వెళ్ళదన్నది వేనాటి ఫ్యామిలీ ధీమా.

ఇరు వర్గాలు పోటాపోటీగా అమ్మవారికంటే ఎక్కువగా టీడీపీ అధిష్టానం ప్రసన్నం కోసం పాకులాడుతున్నారట. వేనాటి సతీష్ రెడ్డి కుటుంబం లోకేష్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటుంది. అలాగే జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి,నారాయణ కూడా సతీష్‌రెడ్డి వైపే మొగ్గుతున్నట్టు సమాచారం. అయితే…. గంగాప్రసాద్‌ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా పలుకుబడినంతా ఉపయోగించి తనవంతు ప్రయత్నాలు చేస్తుండటం మేటర్‌ని రక్తి కట్టిస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం అధిష్టానం కూడా డైలమాలో ఉందన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది.ఇరు వర్గాలు రాజకీయంగా బలమైనవి కావడంతో… పార్టీ పెద్దలు అయోమయంలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో సుధాకర్ రెడ్డి అంటే టీడీపీలో కొందరికి పడదు. ఇది గంగాప్రసాద్‌ శిబిరానికి మైనస్‌ కావచ్చన్న లెక్కలున్నాయి. మరోవైపు కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా….ఆలయ అభివృద్ధి, భక్తులకు సదుపాయాల సంగతి పట్టించుకోవడం లేదన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. పాలక మండలి లేని కారణంగా అధికారులు అవినీతిలో మునిగితేలుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కువ నాన్చి మేటర్‌ని బాగా కాంప్లికేట్‌ చేయకుండా వీలైనంత త్వరగా చెంగాళమ్మ ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ని ప్రకటిస్తే మంచిదని అంటున్నారు ఉమ్మడి నెల్లూరు టీడీపీ నాయకులు.నాన్చుడు ధోరణి వల్ల క్యాడర్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోతోందని అంటున్నారు.

ఐతే ఈ విషయంలో అధిష్టానం లెక్కలు వేరుగా ఉన్నాయట. రెండు వర్గాలు పార్టీలో బలమైనవే కాబట్టి ఒకరికి ఆలయ చైర్మన్ పదవి ఇస్తే.. మరో వర్గం అసంతృప్తికి గురయ్యే అవకాశాలున్నట్టు అంచనా వేస్తోంది. ఈ ప్రభావం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద పడుతుందన్న భయంతో…. కొన్నాళ్లు అసలు ఆ జోలికి పోకపోతేనే బెటరని అనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పుడు పదవి ఇచ్చి నిప్పు రాజేయడంకంటే… ఎన్నికల తర్వాత ఇద్దర్నీ కూర్చోబెట్టి కాంప్రమైజ్‌ చేస్తే బెటరని అనుకుంటున్నట్టు తెలిసింది. ఈ లెక్కన స్థానిక సంస్థల ఎన్నికలయ్యేదాకా ఈ విషయంలో ముందడుగు ఉండకపోవచ్చని అంటున్నారు. ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహం, అధిష్టానం ఆశీస్సులు ఎవరికి ఉంటాయో చూడాలి.

Exit mobile version