Off The Record : మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి…. అదే లోక్సభ నియోజకవర్గం పరిధిలో గెలిచిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ఇద్దరూ పాత పరిచయస్తులే. ఒకప్పుడు వైసీపీలో కలిసి పనిచేసిన వారే. కానీ… ఇప్పుడు కూటమిలో చెరో పార్టీ తరపున ఎన్నికై నువ్వెంత అంటే… నువ్వెంత అనుకునే స్థాయిలో ఉన్నారు. ఇద్దరి మధ్య గ్యాప్ ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. 2019 ఎన్నికల్లో ఇద్దరూ వైసీపీ తరపున పోటీచేశారు. అప్పుడు బాలశౌరి బందరు ఎంపీగా గెలిచారు గానీ…. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు ఓడిపోయారు. ఆ తర్వాతి రాజకీయ పరిణామాలతో 2024 ఎన్నికలకు ఏడాది ముందు టీడీపీలో చేరారు యార్లగడ్డ. అప్పుడు వైసీపీ ఎంపీగా ఉన్న బాలశౌరి జనసేన కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో… ఈసారి ఎవరి పార్టీ తరపున వాళ్ళు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు. కానీ… ఈ మధ్య కాలంలో…. ఇద్దరికీ బాగా చెడిందన్నది పొలిటికల్ టాక్. జనసేన ఎంపీకి, ఆయన నియోజకవర్గం పరిధిలోనే ఉన్న టీడీపీ ఎమ్మెల్యేకి మధ్య అగాధం బాగా పెరిగిందని చెప్పుకుంటున్నారు.
అసలు 2019 ఎన్నికల్లో ఇద్దరూ వైసీపీ తరపున పోటీ చేసిన సమయంలోనే కొంత గ్యాప్ వచ్చిందట. అయితే… ఆ తర్వాత కూటమిలోనే… చెరో పార్టీ నుంచి పోటీ చేసినందున విభేదాలు సమసిపోయి అంతా సెట్ అయిందని భావించారు అంతా. కానీ… అలాంటి ప్యాచ్వర్క్ ఏదీ జరగలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయంటున్నారు పరిశీలకులు. అంతకు ముందు ఒకే పార్టీలో ఉండి, ఇప్పుడు ఒకే కూటమి నుంచి గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ వెనక కారణాలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. గన్నవరం నియోజకవర్గంలో టిడిపికి చెందిన కొంతమంది సీనియర్ నాయకులు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీరుపై బహిరంగ విమర్శలు చేశారు. అందులో పొట్లూరి బసవరావు అనే నాయకుడైతే… నేరుగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎమ్మెల్యేని టార్గెట్ చేశారు. అయితే…అదే బసవరావుకు ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కమిటీ డైరెక్టర్గా నామినేటెడ్ పదవి దక్కింది. ఇదే ఎమ్మెల్యే యార్లగడ్డకు వెంకట్రావుకు మింగుడు పడ్డంలేదని నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. తనపై తీవ్ర విమర్శలు చేస్తున్న బసవరావుకు పదవి రావటం వెనక ఎంపీ బాలశౌరి ఉన్నారనేది యార్లగడ్డ మాట.
అలాగే… మల్లవల్లి పారిశ్రామికవాడలో భూముల కేటాయింపు వ్యవహారం కూడా ఇద్దరి మధ్య విభేదాలకు కారణమైందని అంటున్నారు. వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో బాలశౌరి కుటుంబానికి పారిశ్రామికవాడలో భూ కేటాయింపు జరిగింది. ఆ టైంలో కాస్త తేడా కొట్టి ఎంపీ, ఎమ్మెల్యే మధ్య గ్యాప్ పెరిగిందనే చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మెల్లిగా ఈ గ్యాప్ పెరిగి పెద్దదై ఇద్దరూ ఎడముఖం పెడముఖంగా ఉండేదాకా వెళ్ళినట్టు తెలుస్తోంది. ఎంపీ ప్రోగ్రామ్కి ఎమ్మెల్యే వెళ్లకపోవటం, ఎమ్మెల్యే నియోజకవర్గం వైపు ఎంపీ చూడకపోవటంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల బాలశౌరి నేషనల్ హైవేల పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించగా…. యార్లగడ్డ డుమ్మా కొట్టారు. అలాగే ఎయిర్పోర్ట్ డెవలప్ మెంట్ కమిటీ మీటింగ్లోనూ ఇదే జరిగిందట. అంతా కలిసి వెళ్ళాలని ఒకవైపు టీడీపీ, జనసేన పెద్దలు పదే పదే చెబుతున్నా…. ఇక్కడ మాత్రం ఎంపీ, ఎమ్మెల్యే డోంట్ కేర్ అన్నట్టుగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ గ్యాప్ ఇలాగే కొనసాగుతుందా? లేక పెద్దలు జోక్యం చేసుకుని సెట్ చేస్తారా అన్నది చూడాలి.
