Off The Record: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ముందు పది రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలకు తోడు…. ఆ రోజున భారీగా చేసిన జన సమీకరణ, బస్సులు, భోజనాలు, స్నాక్స్…ఇలా ఎక్కడా తగ్గలేదు. అదంతా చూసి అంతా… అహో అనుకున్నారు. కానీ…. అధికార యంత్రాంగానికి ఆ తర్వాతే అసలు నొప్పులు మొదలయ్యాయట. సాధారణంగా ఇంట్లో ఏదన్నా పెద్ద ఫంక్షన్ చేసినప్పుడు ఆ తర్వాత నాలుగైదు రోజులు కుటుంబ సభ్యులంతా కాస్త డిఫరెంట్ ఫీలింగ్లో ఉంటారు. కొందరైతే… అబ్బ పులిసిపోయింది రా… బాబూ అని సరదా వ్యాఖ్యలు చేస్తుంటారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా అధికారులకు అలాగే పులిసిపోతోందట. కాకుంటే.. ఇది వేరే రకం. ప్రధానిని ప్రారంభోత్సవానికి ఆహ్వానించడంతో భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు భారీ స్థాయిలో జరిగాయి. ఉన్నతాధికారులు ముందుగానే జిల్లాకు చేరుకున్నారు. వాళ్ళ బస, రవాణా, ప్రోటోకాల్… ఇలా అన్నీ కలిపి బిల్లు బాగానే అయిందట. ఇక అసలు ఖర్చు ప్రారంభోత్సవం రోజున జన సమీకరణ దగ్గర మొదలైంది. ఊళ్ళ నుంచి జనాన్ని తరలించేందుకు పెద్ద సంఖ్యలో బస్సులు పెట్టారు. వచ్చిన వారికి భోజనాలు, స్నాక్స్ ఏర్పాట్లు చేశారు. ఆ రోజు వరకు ఆహా.. అద్భుతం అని అనుకున్నా…ఆ తర్వాత లెక్కలు చూసుకున్నాక అధికారుల గుండెలు గుభిల్లుమన్నాయట.
భోజనాలు, స్నాక్స్కే కోట్ల రూపాయల బిల్లు రావడంతో…. అసలు అధికారికంగా ఎంత ఖర్చయింది..? ఎంత మందికి భోజనాలు ఏర్పాటు చేశారు.. ఎన్ని ప్యాకెట్లు పంపిణీ చేశారు? తిన్నవెన్ని, మిగిలినవి ఎన్ని అంటూ ఆరాలు తీసి షాకవుతున్నారట. ముఖ్యంగా స్నాక్స్ పంపిణీలో నిర్వహణ లోపం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రోగ్రామ్ అయ్యాక ఫైనల్గా రెండు కంటైనర్ల స్నాక్స్ మిగిలిపోయాయని, వాటిని సమీపంలోని ఓ పాఠశాలలో ఉంచారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే… కొన్ని బస్సుల్లో వచ్చిన వారికి భోజనాలు అందలేదని చెప్పుకుంటున్నారు. అదంతా ఒక ఎత్తయితే… ఇక్కడ డబ్బుల పరంగా మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. కార్యక్రమానికి ముందే… మా దగ్గర అంత బడ్జెట్ లేదని స్థానిక అధికారులు చేతులెత్తేయడంతో… లోకల్ లీడర్స్ రంగంలోకి దిగారట. మీకెందుకు, మేం చూసుకుంటామంటూ… తమ కార్యకర్తలు, కార్యక్రమానికి వచ్చిన వారికి తామే భోజనాలు ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చారని సమాచారం. దాంతో ఆఫీర్స్ కూడా అక్కడితో ఖర్చు ఆగిపోయిందనుకున్నారు.
కానీ…. ఎంతైనా పొలిటికల్ పక్షులు కదా…! అందుకే ఆ తర్వాత అసలు బుద్ధి చూపించినట్టు తెలిసింది. ఆ రోజు భోజనాలైతే పెట్టారుగానీ… కార్యక్రమం ముగిశాక ఆ బిల్లుల్ని అధికారులకు పంపడంతో వాళ్ళు అవాక్కయినట్టు తెలిసింది. అసలు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు? మనకు ఎంత బిల్లు ఇచ్చారు? ఆ ఖర్చుకు ప్రామాణికం ఏంటి? నిజమెంత? అబద్దం ఎంత? అంటూ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారట. దీంతో… స్థానిక నాయకులు పెట్టిన ఖర్చు కూడా ప్రభుత్వ ఖాతాలోకి వచ్చిందా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక కొన్ని ఖర్చుల విషయంలో వినిపిస్తున్న అంకెలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. భోజనాలు, స్నాక్స్కు కలిపి సుమారు అయిదు కోట్ల రూపాయలు అయినట్టు ప్రచారం జరుగుతోంది. ట్రాన్స్పోర్ట్, బస్సులు, ఇతర ఏర్పాట్లకు ఇరవై కోట్లు భారీ బిల్లులు వస్తున్నాయన్న చర్చ ఉంది. అన్నీ కలిపి వోవరాల్గా ప్రారంభోత్సవ కార్యక్రమానికి సుమారు 35 కోట్లు ఖర్చయిందన్న టాక్ ఉంది. దీంతో… ఇప్పుడు ఈ బిల్లులు ఎలా చెల్లించాలా అంటూ వివిధ విభాగాల అధికారులు తలలు పట్టుకుంటున్నట్టు తెలిసింది. సరే.. జరిగిందేదో జరిగిందిగానీ… ఈ బిల్లులేంటి? సందట్లో సడేమియా అన్నట్టు.. ఎవరైనా అదనపు బిల్లులు పెట్టారా..? నిబంధనలకు విరుద్ధంగా ఖర్చులు చూపించారా అంటూ అనుమానాలు పెరుగుతున్నాయి. స్థానిక నాయకులు చెబుతున్నభోజనాల ఖర్చును ఎలా పరిగణనలోకి తీసుకోవాలన్నది అర్ధంగాక సతమతం అవుతున్నారట జిల్లా ఆఫీసర్స్.

