Off The Record: కొమురంభీమ్ డీసీసీ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో రచ్చ రేపుతోంది. జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ వ్యవహారశైలిపై పార్టీ వర్గాలే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా వ్యవహారం ముదిరి…. చివరికి ఆ సెగలు గాంధీభవన్ను తాకాయి. ఆసిఫాబాద్ నుంచి వంద మంది దాకా నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ వచ్చి ధర్నా చేయడం పార్టీలో కలకలం రేపుతోంది. మండలాధ్యక్ష పదవుల్ని ఆమె తనకు నచ్చిన వారికే ఇస్తున్నారని, సీనియర్స్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ అసంతృప్తి రగులుతోంది. లోక్సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ. ఎన్నికల సమయంలో టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ బీ ఫాం మీద ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఆమెకు ముందు నుంచి మంత్రి సీతక్క అండదండలున్నాయని చెబుతారు. ఆదివాసీ, పైగా విద్యావంతురాలు కావడంతో పార్టీలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చినట్టు చెబుతారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ముందుండి నడిపించిన విశ్వప్రసాద్ను కాదని సుగుణకు కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై పార్టీ సీనియర్స్లో అసంతృప్తి వ్యక్తం అవుతోందట. అయితే సీతక్క అండదండలు మెండుగా ఉండడం, పైగా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఆమే కావడంతో ఇన్నాళ్ళు పెద్దగా ఎవ్వరు బయటకు రాలేదట.
కానీ… మారిన రాజకీయ పరిణామాలతో మరో మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఆ తర్వాతి నుంచి అప్పడప్పుడు అసంతృప్తి వ్యక్తమవుతూనే ఉంది. కానీ… ఇటీవల ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కొత్త మండల అధ్యక్షుల ప్రకటనతో పార్టీ సీనియర్ నాయకుల అసంతృప్తి పీక్స్కు చేరింది. డీసీసీ అధ్యక్షురాలు సుగుణ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని, తన వర్గానికే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపిస్తోంది ప్రత్యర్థి వర్గం. పార్టీ కోసం 20 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని గుర్తించకుండా ఒక వర్గానికి చెందిన, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా సందేశాలు వైరల్ అవడంతో పార్టీలో అంతర్గత కుమ్ములాట మరోసారి బహిర్గతమైంది. అధికారంలో ఉన్నప్పటికి ఆసిఫాబాద్ మున్సిపల్ పీఠం పక్క పార్టీ ఖాతాలో పడిపోయింది. అందుకు ఇంటర్నల్ వారే కారణమని పార్టీ నాయకులే చెబుతున్నారు. అదలా ఉంటే… తాజా వివాదం హైదరాబాద్ దాకా చేరడం వెనక వేరే రాజకీయ వ్యూహం కూడా ఉండి ఉండవచ్చని అంటున్నారు పరిశీలకులు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ స్థానం నుంచి పోటీ చేయాలనే ఆలోచన ఉన్న నాయకులు ముందే అడ్డుతొలగించుకోవడంలో భాగంగానే మండల అంశాన్ని తెర మీదికి తీసుకువచ్చి జిల్లా అధ్యక్షురాలిని టార్గెట్ చేసి ఉండవచ్చని అంటున్నారు.
అయితే… తాను నాన్ లోకల్ అని వస్తున్న విమర్శలను ఖండించారు ఆక్రం సుగుణ. నేను పక్కా లోకల్. నాది సిర్పూర్ మండలం అంటూ రివర్స్ అటాక్ మొదలుపెట్టారామె. పార్టీలోనే విశ్వ ప్రసాద్, ఆత్రం సక్కు, శ్యామ్ నాయక్లు కలిసి తనపై కుట్రచేస్తున్నారన్నది ఆమె అభియోగం. మంత్రి సీతక్కతో పనులు ఇప్పిస్తామని చెప్పి హైదరాబాద్ తీసుకువెళ్ళి గాంధీభవన్ ముందు కాంట్రాక్టర్లతో ధర్నా చేయించారని అంటున్నారు డీసీసీ అధ్యక్షురాలు. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు, ధర్నాలు, ఫిర్యాదులు ఎలా ఉన్నా ఆసిఫాబాద్ అధికార పార్టీలో గ్రూప్ వార్ మాత్రం గుదిబండగా మారిపోతోందన్న అభిప్రాయం బలపడుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సీనియర్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేయగా… అన్యాయం జరగనివ్వబోనని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిసింది. మండల అధ్యక్షుల ఎంపిక వివాదానికి అధిష్టానం ఎలా చెక్ పెడుతుందోనని ఆసక్తిగా చూస్తున్నారు కార్యకర్తలు.

